జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి తలకిందులుగా తపస్సు చేసినా.. జగన్ గారిని ఇంటికి పంపించలేరని అన్నారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు పేర్ని. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాళ్లకు దమ్ముంటే 2024లో జగన్ గారిని గెలవకుండా ఆపండి అంటూ సవాల్ విసిరారు. బీజేపీ పెద్దలు అంత క్లోజ్ అయితే ఎనిమిదేళ్లుగా పిలుపెందుకు లేదో.. అని ఎద్దేవా చేశారు. పవన్ కు బీజేపీతో సత్సంబంధాలుంటే రాష్ట్రానికేం ఒరిగిందని ప్రశ్నించారు. చేతనైతే డేటా చౌర్యం ఎక్కడో నిరూపించాలన్నారు. డేటా దొంగ చంకలో కూర్చొని డేటా డేటా అంటున్నావ్..! అని విమర్శించారు. మీ డేటా అంతా కేసీఆర్ వద్దనే ఉందన్నారు. నిస్వార్థ సేవ చేస్తున్న వాలంటీర్లపై అపనిందలా..అని ప్రశ్నించారు. వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్న డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉందన్నారు పేర్ని నాని. జగన్ గారి బలం వాలంటీర్లనే ఈ నిందలు వేస్తున్నారన్నారు. జగన్ గారికి నీ మీద జాలి తప్ప కోపం ఎందుకుంటుంది..అని ప్రశ్నించారు.
నాడు చంద్రబాబు డేటా అమ్మితే ఈ ఊపుడేమైంది..? రంకెలేమయ్యాయి..? అని పేర్ని ప్రశ్నించారు. ఆ ఎఫ్ఓఏ ఎవడో…ఏ నిఘా సంస్థలతో విచారణ చేయిస్తావో చేయించుకోవాలన్నారు. జనసేన సభ్యత్వానికి చేస్తున్నదీ డేటా చౌర్యమేనా..? అని ప్రశ్నించారు. కేంద్రం తీస్తున్న జనాభా లెక్కల వివరాలపై మోడీ, అమిత్షాలను కూడా ప్రశ్నిస్తావా..? అని ప్రశ్నించారు పేర్ని. పవన్ కల్యాణ్కి చేతలు తక్కువ మాటలు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేయమని జీవో ఇచ్చిందని సొల్లు కబుర్లు చెప్తున్నాడనీ, కోర్టులో దావా ఫైల్ చేయమని సంబంధిత గ్రామ వార్డు సచివాలయ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అనైతికంగా, దుర్మార్గంగా తప్పుడు నిందలు వేస్తున్న వారి వల్ల వాలంటీర్లలో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వాలంటీర్ల నైతిక స్థైర్యం దెబ్బ తినకుండా, వారిలో విశ్వాసం నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు పేర్ని.
నువ్వు చేతులు కట్టుకుని నిల్చునేది ఎవరి వద్ద అమిత్షా, మోడీ, చంద్రబాబు వద్దే కదా.. చెప్పిన పని సరిగ్గా చేయడం లేదని వారు కొట్టాలన్నారు. కేసులో తీర్పు వస్తే జడ్జి గారే తప్పుడు మాటలని రుజువైతే జైల్లో వేస్తారనీ, అప్పుడు రెడీగా ఉండాలన్నారు. సినిమాలను వదిశాను నా జీవితం ప్రజలకే అంకితం అన్నాడు.. వందకోట్ల ఆదాయం వదిలేసుకున్నాను అన్నాడు. మళ్లీ ఇప్పుడు 3 పూటలా సినిమా షూటింగులు చేసుకుంటూ జాగ్రత్తగా సంపాదించుకుంటున్నాడని అన్నారు. రాజకీయాల్లోకి వస్తే ఎంత బరితెగించైనా మాట్లాడ వచ్చనే తప్పుడు ఆలోచనతో నోటికొచ్చింది పవన్ మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. జనసేన క్యాడర్ నుండి సేకరిస్తున్న డేటా అంతా నువ్వు ఎవడికిస్తున్నావ్…ఎక్కడ పెడుతున్నావ్..? ఓటరు ఐడీ దేనికీ..? ఇది డేటా చౌర్యం కాదా..? అని పేర్ని ప్రశ్నించారు.
కేంద్రం జనాభా లెక్కల కోసం ఆదాయం దగ్గర నుంచి అనేక వివరాలను తీసుకుంటోంది..? ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ లెక్కలన్నీ కావాలి..? అని అమిత్షా, మోడీని కూడా అడుగు…మీరంతా చెవుల్లో గుసగుసలాడుకుంటారు కదా..? కేంద్రాన్ని అడగడానికి నీకు చేతకాదా..? అని ప్రశ్నించారు. ఏ నిఘా సంస్థలతో విచారణ చేయిస్తావో చేయించుకోమని అన్నారు. అమిత్షాకి నీకు, మోడీకి నీకు నిజంగా బంధం ఉంటే సై…కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో విచారణ చేయిస్తావో…లేదా సీబీఐతో చేయించుకుంటావో చేయించుకోమని అన్నారు. తప్పుడు మాటలు మాట్లాడి బురదేసి చంద్రబాబు కోసం బతుకుదామనే తప్పుడు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అమిత్షాతో మాట్లాడితే ఎవరికి గొప్ప అని ప్రశ్నించారు. మన దగ్గర సరుకులేనప్పుడే వారిని వీరిని చూపిస్తామంటారనీ, ఖలేజా ఉన్న వాడి మాటలు ఇవి కాదు..రా చూసుకుందాం అంటాడు. అమిత్షాతో మాట్లాడితే ఎమవుతుంది…ఎవడికి ఊడుతుంది..? అని ప్రశ్నించారు. పవన్ ..కేసీఆర్కి వ్యతిరేకంగా హైదరాబాద్లో మాట్లాడలేడు…ఢిల్లీలో మోడీ గారి దగ్గర మాట్లాడలేడని అన్నారు.
పవన్, చంద్రబాబు, బీజేపీ కలిసి ఐదేళ్లు ప్రభుత్వం నడిపినప్పుడే లోటు బడ్జెట్ రూ.16వేల కోట్లు తీసుకురాలేకపోయారనీ, ఎన్డీయేలో లేకుండా బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగకుండానే కేంద్రం నుంచి లోటు బడ్జెట్ కింద రూ.12వేల కోట్ల బకాయిలు వసూలు చేసుకుని వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అని, దీనికి మీరంతా సిగ్గుపడాలన్నారు. రాష్ట్రం విడిపోయి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే..కేంద్రం రూ.16వేల కోట్లు ఇవ్వాల్సి వస్తే..మీరు ముగ్గురు కలిసి చచ్చీ చెడీ తెచ్చింది రూ.4 వేల కోట్లు మాత్రమేనన్నారు. హరేరామ జోగయ్య రాసిన లేఖను ప్రస్తావిస్తూ రాబోయే ఎన్నికల్లో చూద్దాం..నువ్వు ఏంటో..నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తావో..అని అన్నారు. ప్రజలు బాగుండాలంటే జగన్ ప్రభుత్వమే రావాలి, ప్రజలు బాగుండాలంటే జగన్ పరిపాలన తిరిగి రావాలి అని అన్నారు పేర్ని నాని.