CM YS Jagan: విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్దపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని, పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత అని అన్నారు. పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గడచిన 64 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకుని ప్రజలంతా మన పోలీసులకు మనసులో సెల్యూట్ చేసే రోజు ఇది అని అన్నారు. అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని పేర్కొన్నారు సీఎం జగన్. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సాంకేతికతకు తగినట్లు అప్ డేట్ అవుతూ శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు సీఎం జగన్. ఇదే సందర్భంలో ఇటీవల జరిగిన పలు సంక్షటనలు ఉదహరిస్తూ ప్రతిపక్షాలపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నూజివీడులో కానిస్టేబుల్ హత్య ఘటన, అంగళ్లు, పుంగనూరు ఘటనలను పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించిందన్నారు. పుంగనూరు ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయాలు అయ్యాయనీ, ఒక పోలీస్ కన్ను కోల్పోయారని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి సాక్ష్యాదారాలతో దొరికిన వారికి న్యాయస్థానాల నుండి అనుకూల ఉత్తర్వులు రావడం లేదని చివరకు న్యాయమూర్తులపైనా ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. కాబట్టి ..ఇటువంటి దుష్టశక్తుల విషయంలో పోలీసులు కఠినంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.
ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెట్టపీట వేస్తొందని చెప్పారు. వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ .. ఆరోగ్య భద్రత కల్పిస్తొందని తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్ లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స అందిస్తొందని అన్నారు సీఎం జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు ఎస్ బీ ఐ ద్వారా భీమా సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలను వివరించిన సీఎం జగన్ .. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.