Allagadda (Anantapur): ఆళ్లగడ్డ మండలంలోని ప్రసిద్ద శైవ క్షేత్రం రామతీర్ధం సమీపంలోని పుట్టాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి పుట్టకు భక్తులు పాలు పొసి మొక్కుబడులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్వతీ దేవి తపస్సు చేసిన ఈ ప్రాంతంలోని ఆలయంలోని పుట్ట ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల నమ్మిక. సంతాన ప్రదాత అయిన శ్రీ సుబ్రమణ్యేశ్వ స్వామి వారిని ఇక్కడ దర్శించుకుని మనసులో కోరికను చెప్పుకుంటే తప్పక తీరిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే సంతానం లేని వారు అభిషేకం చేయించి ఉయ్యాల కడుతుంటారు.
నాగదోషం నివారణకు ఇక్కడ పూజలు చేస్తుకుంటారు. ఈ క్షేత్రంలో పరుశురాముడు ప్రతిష్ట చేసిన పరుశురామేశ్వరస్వామి వారి శివాలయం, కొండపైన స్వయంభువుగా వెలసిన శ్రీయోగనంద నరసింహ స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతి ఆదివారం ఆళ్లగడ్డ, నంద్యాల, జమ్మలమగుడు, తాడిపత్రి ప్రాంతాల నుండే కాక పలు ప్రదేశాల నుండి భక్తులు ఇక్కడకు తరలి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.