మార్గదర్శి కేసులో ఏపీ సర్కార్ కు మరో సారి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుండి ఏపీకి కేసులు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీలను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసు బదిలీపై ఏపి ప్రభుత్వం పిటిషన్లపై విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని చెప్పింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిది తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్లు కాలం చెల్లినవని సుప్రీం కోర్టు చెప్పింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కేవి విశ్వనాథన్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం సూచించింది.
మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్చ ను తెలంగాణ హైకోర్టుకే సుప్రీం కోర్టు వదిలేసింది. చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టుకే చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులకు సుప్రీం కోర్టు సూచించింది. హైకోర్టు తుది ఆదేశాలు వెలువడిన తర్వాత సుప్రీం కోర్టుకు రావొచ్చని తెలిపింది. కాగా.. మార్గదర్శి చిట్స్ ను స్తంభింపజేయడంపై గతంలో హైకోర్టు స్టే ఇవ్వగా, దానిపైనా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును అశ్రయించింది. అప్పుడు కూడా హైకోర్టు స్టే పై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నో చెప్పింది.
క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ .. ఔషదాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు