Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంపై టీడీపీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జనసేన మాదిరిగానే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ నుండి జనసేన తప్పుకున్న విషయం తెలిసిందే. బద్వేల్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మృతి చెందిన ఎమ్మెల్యే భార్య పోటీ చేస్తున్న నేపథ్యంలో మానవతా దృక్పదంతో తమ పార్టీ నుండి పోటీ పెట్టడం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇతర పార్టీలతో మాట్లాడుకుని ఏకగ్రీవం చేసుకోవాలని కూడా సూచించారు. అయితే ఉప ఎన్నికలకు ముందుగానే టీడీపీ ఓబులాపురం రాజశేఖర్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. జనసేన పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీడీపీ పోలిట్ బ్యూరో నేడు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ గా ఉన్న సమయంలో మృతి చెెందిన ప్రజా ప్రతినిధి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తే మానవతాదృక్పదంతో పోటీ పెట్టకూడదన్న సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేననీ, బద్వేల్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే సతీమణికి వైసీపీ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినందున సంప్రదాయాన్ని అనుసరించి టీడీపీ నుండి పోటీ పెట్టకూడదని నిర్ణయానికి వచ్చారు. అయితే ఓబులాపురం రాజశేఖర్ ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించినందున పార్టీ ఆయనతో చర్చించి ఈ నిర్ణయాన్ని వెల్లడించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నవతరం పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ వైసీపీ నుండి ప్రతిపాదన వస్తే సహకరించేందుకు సిద్ధమని తెలియజేసింది.
Badvel Bypoll: ఉప ఎన్నికల్లో పోటీకి బీజేపీ సై
మరో వైపు బీజేపీ మాత్రం పోటీకి సిద్ధం అవుతోంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో తమ భాగస్వామ్య పార్టీ జనసేన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో సంప్రదింపులను నిర్వహించిన తరువాత అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సోము వీర్రాజు. జిల్లా స్థాయి నాయకులతో చర్చించి నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న అభ్యర్థిని నిలుపుతామని సోము వీర్రాజు తెలిపారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో కడప జిల్లా ముఖ్య నేతలతో సోము వీర్రాజు సమావేశం అయ్యారు. బద్వేల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని తేల్చి చెప్పారు. విజయం సాధించడానికి అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సన్నద్దం కావాలని ఆయన పిలుపు నిచ్చారు.
పోటీకి కారణం ఇదే
కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమనీ, అందుకే బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుని ముందుకు సాగుతామన్నారు. బీజేపీ జాతీయ పార్టీ కనుక అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళతామన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో మాత్రం జనసేనతో కాకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. అయితే రాష్ట్ర పార్టీ నిర్ణయంపై కేంద్ర బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా జనసేన పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వాలు బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయో వేచి చూడాలి.