Surrendered: వారం రోజుల నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పెనుబర్తిలో జరిగిన కొట్లాట కేసులో కూన రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయి ఉంది. ఈ కేసులో రవికుమార్ ను అరెస్టు చేసేందుకు ఇటీవల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆయన నివాసానికి వెళ్లగా ఆయన ఆ సమయంలో ఇంట్లో లేరు. అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన రవికుమార్ ను పోలీసులు కోర్టుకు హజరుపర్చారు.
వివరాల్లోకి వెళితే… ఈ నెల 8వ తేదీన మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం కూన రవికుమార్ స్వగ్రామం పెనుబర్తిలో టీడీపీ, వైసీపీ ఏజంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ విషయం తెలుసుకున్న కూన రవికుమార్ అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా కూన రవికుమార్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించడంతో పాటు డీఎస్పీ తీరును విమర్శించారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న డీఎస్పీ సహా పోలీసుల పట్ల దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై కూన రవికుమార్ తో సహా 29 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 20 మందిని టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఓ పోలీస్ అధికారిపైనా చర్యలు తీసుకున్నారు.