TDP Leaders House Arrest: జంగారెడ్డిగూడెంలో జరిగిన నాటు సారా మరణాలపై టీడీపీ ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. బాధితులు, టీడీపీ నేతలు అవి నాటు సారా మరణాలు అని చెబుతున్నారు. బాధితులను ఆదుకోవాలని, నాటుసారా, కల్తీ మద్యం మరణాలపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు శాసనసభ, శాసన మండలిలో ఇటు బయట టీడీపీ ఆందోళన చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం విజయవాడ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద టీడీపీ నిరసనకు పిలుపునిచ్చింది.
TDP Leaders House Arrest: టీడీపీ నేతల గృహ నిర్బంధం
దీంతో పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. అసెంబ్లీ నుండి సస్పెండ్ అయిన 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు టీడీపీ శ్రేణులు రాకుండా భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడలో దేవినేని ఉమామహేశ్వరరావు, కింజారపు అచ్చెన్నాయుడు. బొండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, వర్ల రామయ్యలను గృహ నిర్భంధం చేశారు.
జంగారెడ్డిగూడెంలోని భాధిత కుటుంబాలకు టీడీపీ లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వం ఇవి సహజ మరణాలుగా పేర్కొనడంతో ప్రభుత్వం ద్వారా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీలో, మండలిలో టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చి చర్చకు పట్టుబడుతూ ఆందోళన కొనసాగిస్తూనే ఉంది.