AP Cabinet Meet: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. దాదాపు 40 అంశాల అజెండాతో మంత్రివర్గం సమావేశం అవుతోంది. మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించి ఆమోదించనున్నది. అదే విధంగా కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు, స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదన తదితర కీలక విషయాలపై ఈ కేబినెట్ భేటీ చర్చించి ఆమోదించనున్నది. ఇప్పటికే 12 రాష్ట్రాలలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలు ఉన్నట్లు గుర్తించి ఏపి సర్కార్..అదే తరహాలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశంపై కూలంకుషంగా కేబినెట్ చర్చించనున్నది.
గృహాలు మంజూరైన లబ్దిదారులకు అదనంగా మరో రూ.35వేలు రుణాన్ని ఇచ్చే ప్రతిపాదనపైనా కేబినెట్ లో చర్చ జరగనుంది. ఆసరా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసే అంశానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పాఠశాలలు, ఆసుపత్రులు పునః నిర్మాణానికి ఆర్థికసాయం అందించే దాతల పేర్లును పెట్టేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకువచ్చే అంశంపై నిర్ణయం తీసుకోంది కేబినెట్, విశాఖ ఏకలవ్య పాఠశాల ఏర్పాటు, బద్వేల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్, హోంగార్డుల నియామకం తదితర కీలక అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. ఆదే విధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల చివరి వారంలో గానీ వచ్చే నెలలో గానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలనతో పాటు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, గ్రామ సచివాలయ వ్యవస్థ పని తీరు తదితర అంశాల పరిశీలనకు సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని గతంలోనే భావించినప్పటికీ కరోనా నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినందున ఆక్టోబర్ రెండు నుండి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించే అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లో కోర్టు చిక్కులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలపై కోర్టులకు వెళ్లడం, అధికారులను కోర్టుకు పిలిపించడం వంటి విషయాలపై భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేదానిపైనా చర్చించనున్నట్లు సమాచారం.