Traffic Police : సీతయ్య ఎవరి మాట వినడు, నేను ఇంతే అన్న డైలాగ్ లు సినిమాల్లో చూసి ఉంటారు కదా..ఇక్కడ ఓ పోలీస్ అధికారి తీరు అంతే..ఆయన ఉన్నతాధికారి చెప్పిందే వినడు. నేను ఇంతే అనేలా ప్రవర్తిస్తున్నాడు. మాస్క్ పెట్టుకోలేదని జరిమానా కట్టించినా ఆ అధికారిలో ఏ మార్పు లేదు. ప్రభుత్వ సూచనలు, హెచ్చరికలు ప్రజలకే కానీ తనకు కాదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తుండటంపై నెటిజన్ లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇంతకూ విషయం ఏమిటంటే..కరోనా కట్టడికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పంచాయతీ, మున్సిపల్, పోలీస్ శాఖలను ప్రభుత్వం అదేశించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించకుండా రోడ్డుపై వచ్చే వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులో రెండు రోజుల క్రితం మాస్క్ లపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించగా ఎస్ఈ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావుకు మాస్క్ లేకపోవడం చూసిన ఎస్పీ ఆయనకు క్లాస్ తీసుకున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన మనమే కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఎలా ఉంటూ స్వయంగా సదరు సీఐకి ముక్కుకు మాస్కు తగిలించారు ఎస్పీ అమ్మిరెడ్డి. మాస్క్ లేకుండా విధులకు వచ్చినందుకు జరిమానా కూడా వసూలు చేశారు.
ఇది జరిగి రెండు రోజులు గడిచిందో లేదో ఎస్పీ సూచనలు ఆ అధికారి బేఖాతరు చేశారు. ఎస్పీ గారు తగిలించిన మాస్క్ పోయిందో లేక తనకు కరోనా రాదనీ ధీమా నేమో మళ్లీ మాస్కు లేకుండానే సదరు సీఐ మల్లికార్జునరావు బుధవారం ట్రాఫిక్ డ్యూటీ లో పాల్గొన్నారు. ఇది చూసిన ప్రజలు తమ సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.