తిరుమల అలిపిరి నడక మార్గంలో లక్షిత అనే ఆరేళ్ల బాలికను చిరుత బలి తీసుకున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడక మార్గంలో 7వ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకూ హై అలర్ట్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. ఈ హైఅలర్ట్ జోన్ లో ప్రది వంద మంది భక్తులను ఓ బృందంగా పంపిస్తారు. భక్తులకు ముందు భాగంలో, వెనుక బాగంలో రోప్ లతో రక్షణ కల్పిస్తారు. ఈ బృందానికి పైలెట్ గా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
కాగా, టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇవేళ లక్షిత పై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై అధికారులతో ఆయన మాట్లాడారు. జూన్ 22న లాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టీటీడీ ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుందని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు. తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెంకు చెందిన దినేశ్, శశికళ దంపతుల కుమార్తె లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాలిక కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని ఆయన తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీటీడీ రూ.5లక్షలు, అటవీ శాఖ రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామని చెప్పారు.
Pawan Kalyan: తన పర్యటనలో ఆంక్షలు పెడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం