గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, ఇప్పుడు అధికార వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు విశాఖ సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు. రీసెంట్ గా ఆయన వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. గతంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంగా గుర్తింపు పొందిన పంచకర్ల ఇప్పుడు టీడీపీలో జాయన్ అవుతారా..? లేక జనసేన పార్టీలోకి వెళతారా..? అనేది విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పంచకర్ల రమేష్ బాబు తన 14 సంవత్సరాల పొలిటికల్ కేరీర్ లో నాలుగు పార్టీలు మారారు. తొలుత ప్రజారాజ్యం ద్వారా 2009 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. దాంతో పంచకర్ల కాంగ్రెస్ సభ్యుడుగా 2014 వరకూ అసెంబ్లీలో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పంచకర్ల.
2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ లతో కలిసి పంచకర్ల టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి రెండవ సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత పార్టీ ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడుగా నియమితులైయ్యారు. 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుండి రెండో సారి పోటీ చేసినా వైసీపీ గాలిలో ఓటమి పాలైయ్యారు. విశాఖ రూరల్ లో ఒక్క స్థానంలో కూడా టీడీపీ గెలవకపోవడంతో పంచకచర్ల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది నెలల పాటు సైలెంట్ గా ఉన్న పంచకర్ల 2020 ఆగస్టు 29న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ కూడా ఆయన జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పుడు ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉండటంతో పంచకర్లకు టికెట్ దక్కే పరిస్థితి కనబడటం లేదు. ఇటీవల కాలం వరకూ వైసీపీ తనకు టికెట్ కేటాయిస్తుందన్న భావనతో నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల మద్య వార్ నడుస్తొంది. ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకునే పరిస్థితి వరకూ వచ్చింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అదీప్ రాజ్ కు మద్దతుగా ఉండటంతో వైసీపీ టికెట్ వచ్చే అవకాశం లేదని డిసైడ్ అయ్యే పంచకర్ల పార్టీ నుండి బయటకు వెళ్లారని భావిస్తున్నారు. అయితే టీడీపీలో పదవులు అనుభవించి, ఆ తర్వాత పార్టీ కష్టకాలంలో బయటకు వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని రీసెంట్ గా టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రకటించారు. దీంతో పంచకర్లకు టీడీపీ డోర్స్ క్లోజ్ అయినట్లేనన్న మాట వినబడుతోంది. ఇక పంచకర్ల రమేష్ బాబు ముందున్న ఆప్షన్ జనసేన మాత్రమే.
మరో పక్క ఇప్పటికే పెందుర్తి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తగా పార్టీ ప్రధాన కార్యదర్శి శివ శంకరరావు ఉన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని పలువురు జనసేన, టీడీపీ శ్రేణులతో పంచకర్లకు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. త్వరలో తన వర్గీయులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలియజేసిన పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలోనే చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో పెందుర్తి నుండి ప్రజారాజ్యం పార్టీ గెలుపొంది ఉండటం వల్ల ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పెందుర్తిని జనసేన కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ పెందుర్తి కుదరకపోతే యలమంచిలి నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు. అయితే అనకాపల్లి పార్లమెంట్ సీటుకు పంచకర్ల పేరు పరిశీలించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చూడాలి పంచకర్ల పయనమెటో..!
Nitin Gadkari: ఏపి సర్కార్ పై కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంసలు