YSRCP: పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీరియస్ నిర్ణయం తీసుకుంది వైసీపీ. పార్టీ లైన్ దాటిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం చర్యలకు సిద్దమైంది. టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ నేతలు స్పీకర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ నలుగురు ఎమ్మెల్యేలను నాడు పార్టీ నుండి వైసీపీ సస్పెండ్ చేసింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లోనూ వీరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
అలానే జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య పైనా అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటి పని చేశారంటూ స్పీకర్ కు చేసిన ఫిర్యాదులో పలు ఆధారాలను కూడా సమర్పించినట్లు తెలుస్తొంది. అయితే వీరి అనర్హత ఫిర్యాదులపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ వెంటనే చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపైనా స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.