కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ భరత్ కు మంత్రి పదవిని ఖాయం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. వైసీపీ కార్యకర్తల భేటీలో భాగంగా గురువారం సాయంత్రం మొదటగా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి 50 మంది నేతలతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశాల ఉద్దేశాన్ని వివరించిన జగన్.. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించాలని సూచించారు. నియోజకవర్గ నేతలు చెప్పిన విషయాలను ఆలకించారు.
అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కంటే గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుండే మొదలు కావాలని జగన్ పిలుపునిచ్చారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్నారు. కుప్పం నుండి భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ సమావేశ సందర్భంలోనే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి రూ.65 కోేట్ల విలువైన పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కుప్పం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పారు. నేరుగా కార్యకర్తలు, నేతలతో సీఎం జగన్ భేటీ కావడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.