YSRCP: ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి రాబోయే ఎన్నికల్లో పోటీపై పరేషాన్ అవుతున్నారు. పెనమలూరు నుండి మళ్లీ పోటీ తానే చేయాలని ఆయన భావిస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం పార్ధసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు టికెట్ ను వేరే నేతకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధి పోటీ చేస్తున్న నేపథ్యంలో పార్ధసారధి విజయం అంత ఈజీ కాదని సర్వే నివేదికలు వచ్చిన నేపథ్యంలో అక్కడ పార్ధసారధి కాకుండా ధీటైన అభ్యర్ధిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తొంది.
ఎందుకంటే 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగ్గా కేవలం 177 ఓట్ల తేడా తోనే నాడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కొలుసు పార్ధసారధి విజయం సాధించారు. నాడు పీఆర్పీ అభ్యర్ధికి 30వేల పైచిలుకు ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి చలసాని వెంకటేశ్వరరావుపై పార్ధసారధి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ బీఎస్పీ అభ్యర్ధికి 15వేలకుపైగా ఓట్లు రాగా, కేవలం 11,317 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి పార్ధసారధి తన సమీప టీడీపీ అభ్యర్ధి బోడె ప్రసాద్ పై విజయం సాధించారు. ఈ లెక్కల నేపథ్యంలో పార్ధసారధిని మచిలీపట్నం లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం కోరుతోంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి సారి గెలుస్తూ వచ్చిన పార్ధసారధి 2014 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. అయితే కొలుసు పార్ధసారధి తండ్రి దివంగత కొలుసు రెడ్డయ్య యాదవ్ మచిలీపట్నం లోక్ సభ నుండి రెండు సార్లు పోటీ చేసి ఒక సారి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి నాటి కాంగ్రెస్ అభ్యర్ధి కావూరి సాంబశివరావుపై రెడ్డయ్య యాదవ్ విజయం సాధించారు. ఆ తర్వాత 1996లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి పరాజయం పాలైయ్యారు.
సీఎం జగన్ సూచనల మేరకు పార్టీ పెద్దలు నిన్న పార్ధసారధితో చర్చించారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కోరినట్లుగా తెలుస్తొంది. అయితే ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే పార్ధసారధి తిరస్కరించారని సమాచారం. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకుంటారని కూడా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు పార్ధసారధికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వీరి భేటీలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ నేతలకు తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారుట పార్ధసారధి.
2004 లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కొలుసు పార్ధసారధి ఉయ్యూరు నుండి మొదటి సారి గా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ నుండి, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పెనమలూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. జగన్మోహనరెడ్డి కేబినెట్ లోనూ అవకాశం లభిస్తుందని ఆశించి భంగపడ్డారు. ఆ అసంతృప్తితోనే రీసెంట్ గా జరిగిన వైసీపీ సామాజిక సాధికార యాత్రలో తన ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గ ప్రజలు ప్రతి సారి తనను ఆదరిస్తూ గెలిపిస్తున్నారు గానీ తనను సీఎం జగన్ గుర్తించడం లేదని పార్ధసారధి ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పెనమలూరు వైసీపీ ఇన్ చార్జిగా కొత్తనేతను ఎంపిక చేస్తున్నారని తెలియడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ పెద్దలు పార్ధసారధిలో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పార్ధసారధి పార్టీ వీడకుండా ఉండేందుకు సీఎం జగన్ తోనూ సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే మచిలీపట్నంకు వెళ్లేందుకు పార్ధసారధి ససేమిరా అనడంతో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్ధసారధి పార్టీ వీడతారా..? సర్దుకుపోతారా ? అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక సారి నిర్ణయం తీసుకున్నారు అంటే వెనక్కు తగ్గే అవకాశం లేదు. ఇటు పార్ధసారధి కూడా పెనమలూరుపైనే పంతం పట్టుకుని కూర్చున్నారు. ఏమి జరుగుతుందో అనేది హాట్ టాపిక్ గా మారింది.
YSRCP: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ..?