వేల కోట్లు ఊరకే చేతులు మారవు..!! క్లాజులుంటాయ్, కారణాలుంటాయ్, కోరికలుంటాయ్!! ఏపీలో అటువంటిదే తాజాగా ఓ డీల్ జరిగింది. ఓ పెద్ద పోర్టు అదానీ పరమయ్యింది. పోర్టులో 75 శాతం వాటా అదానీ చేతికి చిక్కింది..! ఇది ఊరికే జరిగే వ్యవహారం కాదు. రాజకీయమూ.., రాజీమార్గమూ.., చీకటి తంత్రమూ ఎన్నో ఈ డీల్ ని నడిపించాయి..!!
ముందు సూటిగా విషయం చూద్దాం..!!
నవయుగ అంటే బాగా తెలుసు అందరికీ..! ఆ నవయుగ చేతిలో రాష్ట్రంలో ఎన్నెన్నో ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒక్కోటీ చేతులు మారుతున్నాయి. తాజాగా ఏం జరిగింది అంటే..? నవయుగ చేతిలో ఉన్న కృష్ణపట్నం పోర్టు (నెల్లూరు జిల్లా)లో 75 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ అనే సంస్థకి వెళ్ళింది. సింపుల్ గా ఆదానీకి వెళ్ళింది. దీని విలువ రూ. 13 , 572 కోట్లు. ఇన్నాళ్లు నవయుగ పూర్తిస్థాయిలో వాటాదారుగా ఉండగా, తాజాగా 75 శాతం తీసుకుని పూర్తి అజమాయిషీ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది.
నవయుగ నుండి ఎందుకు తీసేసారు…?
ఇప్పుడు మరో కీలక విషయం చూసుకోవాలి. నవయుగ అంటే పెద్ద కంపెనీ. అంతర్జాతీయ చరిత్ర ఉంది. ఇంజనీరింగ్ పనులు, ప్రాజెక్టులు, స్టీల్, ఎక్స్పోర్ట్, ఐటీ, పవర్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా విభాగాల్లో నవయుగ ముద్ర ఉంది. కృష్ణపట్నం పోర్టుతో వారి సామ్రాజ్యం మరింత విస్తరించింది. ఈ కంపెనీనే చంద్రబాబు హయాంలో అనేక ప్రాజెక్టులు దక్కించుకుంది. పట్టిసీమను తీసుకుని గాయిత్రి వంటి చిన్న కంపెనీలకు సబ్ ఇచ్చేసింది. పోలవరం పనులను చేపట్టి చాలా కాలం చేసింది. చంద్రబాబు హయాంలో గిన్నిస్ రికార్డులనీ.., బొమ్మలు, ఫొటోలతో బాగా హడావిడి చేసింది. బందరు పోర్టు దక్కించుకుంది. ఇంకా ఉంటే రామాయపట్నం కూడా కొట్టేసేదే.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఆ కంపెనీకి చెందినవని రద్దు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుని మేఘా దక్కించుకుంది. బందరు పోర్టు రద్దయింది. తాజాగా కీలకమైన కృష్ణపట్నం పోర్టులో వాటా వెళ్ళిపోయింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే… నవయుగ ఏమి రాజకీయంగా జగన్ తో విభేదించలేదు. వైఎస్ ఉన్నప్పటి నుండి ఈ కుటుంబాల మధ్య ఓ అవగాహన ఉంది. అయితే జగన్ కి ఉన్న వేరే ప్రాధాన్యాలు, దృష్ట్యా ఈ మార్పులు చేర్పులు తప్పవు.
అదానీ ఎందుకు ఎంటర్ అయినట్టు..??
ఒకే. వాటా వెళ్ళింది. నవయుగ అలా తప్పుకుంది. కానీ అదానికే ఎందుకు ఇచ్చినట్టు..?? ఇతర చాలా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయిగా.., అంబానీ, మేఘా లాంటి వాళ్ళు ఉన్నారుగా అనే అనుమానాలు రావచ్చు. ఈ విషయం చెప్పుకుందాం..!! అంబానీకి, ఆదానీకి చాలా తేడా ఉంది. అంబానీ అందరి మనిషి. సోనియా, మోడీ, చంద్రబాబు, జగన్ ఇలా అందరితోనూ తాను బాగానే ఉంటారు. ఎవరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోడు. తన అవసరాలు, ప్రాధాన్యాలు తనకు ఉంటాయి. కానీ అదానీ అలా కాదు. అతనికి ఆమూలాగ్రం మోదీనే. మోడీ వచ్చిన తర్వాత అదానీ గ్రూపు బలం పదుల రెట్లు పెరుగుతుంది. ఇక మోడీ – జగన్ ల బంధం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అందుకే బీజేపీ – వైసీపీ మధ్యలో అదానీ అన్నమాట. కేంద్రంలో కార్పొరేట్ దిగ్గజాలుగా ఉన్న అంబానీ, ఆదానీలతో జగన్ ఇలా వియ్యం కుదుర్చుకున్నట్టు. నత్వానికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా అంబానీతో.., ఈ పోర్టు వాటా ద్వారా ఆదానీతోనూ వియ్యం కలిసినట్టే. ఇక కార్పొరేట్ ని రాష్ట్రంలో ఆపతరమా …? జగన్ – బీజేపీ బంధాన్ని శంకించతరమా..??!