కరోనా వచ్చింది. మనతోనే ఉంది. కొన్ని నెలల్లో వెళ్ళిపోతుంది. ఏదోటి చేసి, మానవ మేధస్సుతో కాస్త ఆలస్యంగా అయినా విరుగుడు మందులు కనిపెట్టి దాన్ని అధిగమిస్తాం. సరే…! మరి అది చేసి పోయిన నష్టాన్నో…? అది వదిలేసి వెళ్లిన కష్టాలనో…? అది వేసి వెళ్లిన మచ్చలనో…? ఎలా అధిగమిస్తాం? ఎలా తీర్చుకుంటాం? ఎలా తుడుచుకుంటాం? అసలే ప్రపంచ ఆహార, ఆరోగ్య, వాణిజ్య వంటి ప్రముఖ సంస్థలన్నీ హెచ్చరిస్తున్నాయి “ప్రపంచానికి ఆహార సంక్షోభం” పొంచి ఉంది అని. అంటే తిండి తగ్గించుకోవాలా? అధిగమించాలా? పరిష్కారం ఏదో పెద్దలు సూచిస్తారు, ముందు సమస్యని అర్ధం చేసుకుందాం పదండి…!
696 కిలోలు తినేస్తున్నాం…!
అవును. మీరు, నేను, ప్రపంచంలో అందరం సగటున ఏడాదికి 696 కిలోలు తినేస్తున్నాం. ఇది సగటు లెక్క, ఒకరోజు తక్కువ కావచ్చు. మరో రోజు ఎక్కువ కావచ్చు… ఒకరు తక్కువ కావచ్చు, మరొకరు ఎక్కువ కావచ్చు… కానీ ఏడాదికి మాత్రం ప్రతి మనిషి అంతే ఉండొచ్చు…! మరి ఇప్పుడు ఉత్పత్తి అంత ఉందా అంటే ఉంది. కానీ వ్యక్తిగతంగా ఏ దేశానికో లేదు, మొత్తం ప్రపంచానికి మాత్రమే ఉంది. అంటే… అన్నం తినే దేశానికి అన్నం చాలినంత ఉండకపోవచ్చు, మాంసం తినే దేశానికి అక్కడ చాలినంత లేకపోవచ్చు… అందుకే వేరే దేశాల నుండి ఎగుమతి, దిగుమతుల ద్వారా నెట్టుకొస్తున్నాము. తద్వారా దేశాల ఆహార సమస్యలను అధిగమిస్తున్నాయి.
ఇక ఏకె, బీకే వస్తాయేమో…!
ఇది ఇప్పటి వరకు. అంటే కాలాల్లో బిసి, ఏసీ (బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్) ఎలాగో… ఇక మీదట బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా రానున్న ఆశ్చర్యం అవసరం లేదు. అంటే ఇప్పటి వరకు తినే తిండి ఓ లెక్క, ఇక మీదట తినే తిండి ఓ లెక్క. మన దేశానికి కాకపోయినా ప్రపంచ దేశాల్లో మాత్రం మారుతుంది. కరోనా వలన మాంసాహారం కాస్త తగ్గుతుంది. ఇప్పటికే చైనాలో తినే అలవాట్లు మారిపోయాయి. మర్చి నెలలో ఆ దేశం లో 42 శాతం మాంసాహారా విక్రయాలు పడిపోయాయి. అంతకు మించిన స్థాయిలో కూరగాయల విక్రయాలు పెరిగాయి. చైనా తరహాలోనే అమెరికా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ , జపాన్ వంటి పెద్ద దేశాల్లో ఆహారపు అలవాట్లు మారుతాయి. అంటే ఎగుమతి, దిగుమతుల లెక్క మారుతుంది. ప్రపంచమంతా ఇమ్యూనిటీ పెంచుకునే పనిలో పడుతుంది.
ఇప్పటి వరకు ఇలా…!
ప్రస్తుతం ఆహారా వినియోగం, ఎగుమతి, దిగుమతి లెక్కలు చూసుకుంటే…
- ప్రపంచం ఉత్పత్తి అవుతున్న బీఫ్ లో చైనా 14 . 8 %, జపాన్ 9 % , దక్షిణ కొరియా 4 . 7 % … , మేక, గొర్రె మాంసంలో చైనా 21 . 6 % , ఫ్రాన్స్ 8 %, సౌదీ అరేబియా 4 % .., చికెన్ లో సౌదీ అరేబియా 7 %, మెక్సికో, చైనాలు చెరో 6 % , వినియోగిస్తున్నాయి.
- అలాగే ప్రపంచం లో ఉత్పత్తి అవుతున్న రైస్ లో ఇండియా 10 . 2 %, చైనా 8 % , ఇండోనేషియా 4 % తినేస్తున్నాయి. గోధుమల్లో .. ఇండోనేషియా 6 %, ఈజిప్టు 5 %, ఇటలీ 4 % తింటున్నాయి.
- ఇలా ఇప్పటి వరకు మాంసాహారాలు, శాఖాహారాల్లో ఓ లెక్క ఉంది. ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతుల ఆధారంగా నెట్టుకొస్తున్నాయి. తమకు కావాల్సినవి తెచ్చుకుని, తమ వద్ద ఉన్నవి ఇస్తున్నాయి.,
- ఇండియా వరకు చూసుకుంటే మనకు ఉత్పత్తి అయినా రైస్ లో మన వినియోగం పూర్తవ్వగా ఏటా 10 మిలియన్ తన్నులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అంటే దేశంలో పండుతున్న రైస్ లో 93 శాతం మనకు సరిపోతుండగా, మిగిలిన 7 శాతం ఎగుమతి చేస్తున్నాం. మనం గోధుమలను అమెరికా నుండి తీసుకొస్తున్నాం.
- రైస్ ఎగుమతుల్లో ఇండియా, థాయిలాండ్, వియాత్నం ముందున్నాయి. గోధుమల ఎగుమతుల్లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్ ముందున్నాయి. సోయాబీన్స్ ఎగుమతుల్లో బ్రెజిల్, అమెరికా, అర్జెంటీనా ముందున్నాయి.
ఉత్పత్తి క్షీనిస్తుంది…!
గడిచిన పదేళ్లుగా లెక్కలు అటూ , ఇటుగా మారుతున్నా ఎక్కడ పెద్ద వ్యత్యాసల్లేవు. సోయా, గోధుమల వినియోగం పెరిగింది, వాటికి తగిన ఉత్పత్తి వస్తుంది. ఒక మనిషి సగటున ఏడాదికి 696 కిలోలు ఆహారం తింటుంటే దీనిలో 178 కిలోలు కూరగాయలు, 170 కిలోలు మాంసాహారం, 147 కిలోలు ధాన్యాలు (వరి, గోధుమ) తింటున్నారు.(ఇది ప్రపంచ లెక్క) ఇక దేశాల వారీగా చూసుకుంటే చైనా అన్ని రకాల ఆహారాన్ని సమపాళ్లలో వినియోగిస్తుంది. ఇండియా రైస్, గోధుమలు ఎక్కువ, అమెరికా, రష్యా, కెనడాల్లో మాంసాహారం, గోధుమలు ఎక్కువగా తింటున్నారు.
కరోనా వెళ్లిన తర్వాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 15 నుండి 20 శాతం తగ్గుతుందని ప్రపంచ ఆహార సంస్థ లెక్కలు వేస్తుంది. ఇది కచ్చితంగా ఎన్నాళ్ళు ఉంటుంది అనేది తెలియకపోయినా కనీసం మూడేళ్లు దీని ప్రభావం ఉంటుంది. ఒక వేళా ఉత్పత్తి మూడేళ్ళ తర్వాత పెరిగినా ప్రపంచం చూపు ఇక రైస్, గోధుమలు, కూరగాయలపైనే ఎక్కువ పడుతుంది. వీటిని పండించే దేశాలు తక్కువే. వినియోగం ఒకేసారి పెరిగి ఉత్పత్తి అలాగే ఉన్నా, తగ్గినా అది ఆహార సంక్షోభమే. అందుకే తత్సత్త్ జాగ్రత్త అంటుంది ప్రపంచం. ఇండియా వరకు పెద్ద తేడాలు లేకున్నప్పటికీ, అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలకు ఈ పోటు తప్పదు.
– శ్రీనివాస్ మానెం