(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ జండా రంగులు చెరిపి వేయనుందా? లేదా మార్పు చేయనుందా?. ఐతే ప్రభుత్వం ఆ రంగుల మార్పునకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
రంగుల మార్పు ఆర్ధిక భారం
ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టబడింది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. ఈ తరుణంలో కార్యాలయాలపై వేసిన రంగులను పూర్తిగా తొలగించి కొత్తగా రంగులు వేయడం ఆర్ధిక భారంతో కూడుకున్న పని. ఈ పరిస్థితి లో ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాల్సిందేనని ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కోర్టు కూడా సమర్ధించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. అయితే ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి కొత్త రంగులను వేయాలా? లేకపోతే ఉన్న రంగుల్లోనే కొన్ని మార్పులు చేయాలా? అనే విషయంపై పరిశీలన చేసేందుకు ప్రభుత్వం సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ ఏమి చెబుతుంది
ఆ కమిటీ పరిశీలన జరిపి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. రంగుల మార్పు విషయంలో త్రిసభ్య కమిటీ నివేదిక ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.