కొన్ని సంవత్సరాల ముందు నిర్భయ… ఆ తర్వాత ఈ మధ్యనే దిశ… ఇప్పుడేమో స్నేహలత ఇలా ఆడబిడ్డలు అందరూ మనుషుల మధ్య జరుగుతున్న మృగాలకు బలి అవుతున్నారు. మరి అనంతపురంలో జరిగిన స్నేహలత కేసులో కొన్ని కీలక వివరాలు ఇలా ఉన్నాయి..
కుటుంబమే ముందు…
19 ఏళ్ళ వయసులోనే ఒక బ్యాంకు లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలత కుటుంబ కారణాల వల్ల డిగ్రీ రెండవ సంవత్సరం లోనే చదువు ఆపేసి ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు దారుణంగా చంపేశారు అన్న ఆరోపణలు మొదలయ్యాయి. సగం కాలిపోయిన అమ్మాయి అనంతపురం శివార్లలో దొరికింది. స్నేహలత చిన్నప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు నుండి ఆమెను రాజేష్ అనే కుర్రాడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని డిగ్రీ చేరే సమయానికి కూడా ఆమెను విడిచి పెట్టలేదని చెబుతున్నారు. ఆమె ఉద్యోగానికి వెళుతున్న సమయంలో కూడా దారికాచి వేధిస్తూ ఉన్నాడు అని తెలిసింది.
ఇలా బయటపడింది
మొత్తానికి స్నేహలత కు రాజేష్ కు మధ్య ఏదో గొడవ జరిగిందని అనుమానిస్తున్నారు. అందుకే తన స్నేహితుడైన కార్తీక్ తో కలిసి ఆమెను చంపేశాడు అని ఆరోపణలు బయటకు వచ్చాయి. ఇక ఆమెను హత్య చేసి అక్కడ ఏం చేయాలో తెలీక పేపర్లు, ఆకులు దగ్గరగా వేసి పెడితే ఆ శరీరం పాక్షికంగా కాలిపోయింది అని రిపోర్టులు ఉన్నాయి. మృతదేహాన్ని ఎవరో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం బ్యాగులో ఉన్న ఐడెంటిటీ కార్డు చూసి ఆమె అడ్రస్ తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాక్షికంగా కాలిపోయిన తన బిడ్డ శవం ముందు ఏడుస్తున్న తల్లి వీడియో వైరల్ అవుతోంది.
పోలీసులే బాధ్యులు?
ఇక గతంలో రాజేష్ ఆమెను వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదట. ముఖ్యంగా ఆమె దళిత వర్గానికి చెందిన అమ్మాయి కావడంతోనే పోలీసులు అంత నిర్లక్ష్యం వహించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకసారి అయితే ఇలా పలుమార్లు రాజేష్ వేదిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే మీరు ఇల్లు మారితే సరిపోతుంది కదా అని పోలీసులు బ్రహ్మాండమైన సలహా ఇచ్చారని స్నేహలత తల్లి ఆరోపించింది. మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను… వెంటనే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పిన అమ్మాయి ఇలా ఒక్కసారిగా విగతజీవిగా మారడం చూసి తల్లి తట్టుకోలేక పోయింది. ఇక పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా స్పష్టమవుతుంది. దీంతో దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. వెంటనే ఈ సమస్య పెద్దది అయిపోయింది. చంద్రబాబు కూడా ఆమె కులం వల్ల ఆమెకు న్యాయం జరగలేదు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్, చంద్రబాబు బాధితురాలి కి చెరొక 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు.