ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కృషి చేయలేదు అన్నది బహిరంగ సత్యం. వాళ్ళ ఫ్యాన్స్ ను అడిగితే విలువలకు…. కుట్ర రాజకీయాలకు మధ్య పవన్ నలిగిపోతూ ఉన్నాడని అంటారు. ఇక 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పవన్ బిజెపితో జతకట్టినప్పటికీ…. అడపాదడపా అమావాస్య పౌర్ణమి కి వచ్చి కనిపించేవాడే కానీ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఏమాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. అలాంటి పవన్ ఇప్పుడు ఒక్కసారిగా దీక్ష లో కి వెళ్లిపోవడం అన్నది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు దీక్ష ఏమిటి…? దీని ద్వారా పవన్ ఏం సాధించాలి అనుకుంటున్నాడు..?
తన శైలికి పూర్తి విరుద్ధం
పవన్ కళ్యాణ్ ను చూస్తే విప్లవ నాయకుడిని చూసినట్లు ఉంటుంది. క్యూబా కమ్యూనిస్టు చేగువేరా ఆదర్శం అని చెప్పే పవన్ కమ్యూనిస్టులను ఆరాధిస్తాడు. అయితే కమ్యూనిస్టులు నాస్తిక వాదులు. ఆధ్యాత్మిక కు అత్యంత దూరంగా ఉంటారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఉండేవాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అత్యంత అరుదుగా సాధువులు, సన్యాసులు మాత్రమే చేసే ‘చతుర్మాస్య దీక్ష’ చేస్తున్నాడు. తన శైలికి పూర్తి విరుద్ధంగా పవన్ శాంతస్వభావిగా మారడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి కులమత వాదానికి వ్యతిరేకం అని ప్రకటించుకున్న తను ఇలాంటి దీక్ష స్వీకరించడం కొద్ది వరకు షాక్ అనే చెప్పాలి.
దీనిని అయినా సరిగ్గా పాటిస్తున్నాడా..?
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఇంకా మారాలని ఎంతోమంది సూచిస్తూ ఉంటారు. అయితే పవన్ రాజకీయం ఇప్పటికీ రాష్ట్రంలో సగం మందికి అర్థం కాదు. అందరూ హేళన చేసేవారే. పవన్ లో పోరాట పటిమ, దృఢ సంకల్పం, స్ఫూర్తిదాయకమైన విలువలు ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలను వంట పట్టించుకోవడం లో పూర్తిగా విఫలమయ్యారని అంటారు. ఇప్పుడు దీక్ష విషయంలో కూడా పవన్ ఇలాగే ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. పవన్ చేస్తున్న ఈ చాతుర్మాస్య దీక్షలో ఎక్కడికీ వెళ్ళకూడదు. కానీ ఈ దీక్షకు విరామం ఇచ్చి తన అభిమాని, ప్రముఖ హీరో నితిన్ వివాహానికి హాజరయ్యారు .ఇక్కడ విడ్డూరం ఏమిటంటే… పవన్… తన బిడ్డ నిహారిక నిశ్చితార్థానికి డుమ్మా కొట్టాడు. అసలు పవన్ ఈ దీక్షను సీరియస్ గా చేస్తున్నాడా…. లేదా…. అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఇదంతా వారి మెప్పు కోసమే(నా)…?
ఇదిలా ఉండగా పవన్ బిజెపితో కలిసిన తర్వాత చాలా మారిపోయాడని చాలా మంది అంటున్నారు. ఇప్పటివరకు విగ్రహారాధనను పూర్తిగా వ్యతిరేకించిన పవన్ ఒక్కసారిగా ఆధ్యాత్మికంలో కి వెళ్లిపోవడంతో దీని వెనుక బీజేపీ హస్తం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జనసేన వారు బీజేపీని ఒక ఆర్థిక పుష్ఠి ఉన్న పార్టీగానే చూస్తున్నారు తప్పించి వారితో నిజంగా తమ సిద్ధాంతాలను పంచుకోవడం ఇష్టం లేదు అన్నది జనసేన కార్యకర్త మాట… ఆకాంక్ష కూడా. అందుకే ఇక్కడ బిజెపి యాంగిల్ ను సైడ్ చేసి జనసేన ఏపీలో 2024లో అధికారమే లక్ష్యంగా కొనసాగుతోందని.. దాని కోసమే పవన్ ఈ దీక్ష చేస్తున్నట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో హిందుత్వ వాదాన్ని బలపరిచే బిజెపికి మరొక ఆయుధాన్ని అందించాలని పవన్ చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీటన్నింటిపై పవన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటారా…?