YSRCP: రెండున్నరేళ్ల పాలన తర్వాత మంత్రి వర్గంలో మార్పులు భారీగా ఉంటాయని ముందే చెప్పిన సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ఆ మేరకు కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.. అయితే ముందు అనుకున్నట్టు ప్రభుత్వ ప్రక్షాళన మాత్రమే కాకుండా, పార్టీ ప్రక్షాళనకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. మంత్రివర్గంలోని మంత్రులు అందర్నీ తప్పించేసి కొత్త వారిని పెట్టుకోవడంతో పాటూ.., పార్టీలో ద్వితీయ స్థాయిలో ఉంటూ జిల్లాలకు ఇన్చార్జిలుగా బాధ్యతల్లో ఉన్న అయిదుగురిని కూడా మార్చాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. ఇది భారీ కుదుపు కానుంది. కొందరికి ప్రమోషన్లు.. అదే సమయంలో కొందరికి రెవెర్షన్లు కూడా తప్పకపోవచ్చు అనేది వైసీపీ (YSR Congress Partyలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన ఎన్నికల్లో అత్యధిక సీట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న వైసీపీ (ycp) అధినేత, YSRCP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jaganmohan Reddy) వైసీపీ పార్టీ, ప్రభుత్వానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఒక వైపు పార్టీ ప్రక్షాళన, మరో వైపు ప్రభుత్వ ప్రక్షాళన రెండు గట్టిగా చేయాలని జగన్ (Jagan) నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందులో భాగంగా మంత్రివర్గం మొత్తం మార్పు చేయనున్నారు. అంటే ఇప్పుడు ఉన్న మొత్తం మంత్రులను పక్కన పెట్టేసి కొత్తగా 24 మందిని మంత్రులుగా తీసుకోనున్నారు. ఇది ప్రభుత్వ ప్రక్షాళన కిందకు రాగా, పార్టీ ప్రక్షాళన మరో విధంగా చేయనున్నారు. వైసీపీకి జిల్లాల వారీగా అయిదుగుర ఇన్ చార్జిలు విజయసాయిరెడ్డి , వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి లు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు మూడు నాలుగు జిల్లాలకు పార్టీ ఇన్ చార్జిలుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరు పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. మంత్రులు పార్టీని, ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పాలన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే చాలా జిల్లాలో ఈ రెండున్నరేళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య విబేధాలు రావడం, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదనీ, పార్టీ సక్రమంగా పనులు చేయడం లేదనీ, పదవులు రావడం లేదని ఇలా అసంతృప్తులు పెరుగుతున్నాయన్న మాట వినబడుతోంది.
YSRCP: జిల్లాల్లో తగాదాలు – అగాధాలు..!
ఉదాహరణకు చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపి మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మధ్య విబేధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకుని బాహాటంగా విమర్శించుకునే స్థాయికి వచ్చింది. ఓ పర్యాయం వీరి పంచాయతీపై సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకుని ఇద్దరినీ మందలించినట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా గుంటూరు జిల్లాలో నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజనికి మధ్య కూడా విబేధాలు ఉన్నాయి. ఇలానే చాలా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఉన్నాయి.
* ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని వ్యవహారశైలి కారణంగా పార్టీ చాలా దెబ్బతిన్నది. చాలా వరకు శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. బాలినేనిపై వ్యతిరేకత కారణంగా కీలక నేతలు సైలెంట్ అవ్వగా.., రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనంతగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆ జిల్లాలో చురుకవుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రక్షాళనలో అందరికంటే ఎక్కువగా విజయసాయిరెడ్డి సలహా దెబ్బతిన బోతున్నారనే టాక్ వినబడుతోంది. వాస్తవానికి వైసీపీలో విజయసాయి రెడ్డి మొదటి నుండి నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు మంచి ప్రాధాన్యతే దక్కింది. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జ బాధ్యతలు అప్పగించడంతో పాటు ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలను దఖలు పర్చారు. అయితే ఆయనను ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ చార్జి గా నియమించిన తరువాత విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం, అక్కడ ఆయన పై కొన్ని అవినీతి ఆరోపణలు రావడం,. ఆ ఆరోపణలను సరిదిద్దు కునే క్రమంలో విజయసాయి రెడ్డి బహిరంగంగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా తాను అవినీతికి పాల్పడలేదు. తన పేరు చెప్పి ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు.
* మరోవైపు పార్టీకి నంబర్ టూ స్థానంలో ఉండాల్సిన వైవీ సుబ్బారెడ్డి కూడా లోలోపల కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు రాజ్యసభ ఇస్తామన్న హామీ నెరవేరలేదు. ఎమ్మెల్సి చేసి మంత్రిగా చేయాలన్న కోరికను తీర్చలేదు. అందుకే ఆయన సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కీ రోల్ లో ఉన్నారు. పార్టీ వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు. ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీ కావాలన్నా లేదా ఓ ఎమ్మెల్యేకి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇప్పించాలన్నా, ఒక ఎమ్మెల్యేకి ఏదైనా పని జరగాలన్నా సజ్జలనే కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలోనూ (సీఎంఒలో) ఆయనే చక్రం తిప్పుతున్నారు. విజయసాయిరెడ్డి ఢిల్లీ వ్యవహారాలు, ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తూ దూరంగా ఉన్నారు.
ఎవరెవరికి తప్పిస్తారో..!?
ఇప్పుడు పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఎవరెవర్ని జిల్లాల బాధ్యతల నుండి తప్పించనున్నారు అనేది చర్చకు దారి తీస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జి బాధ్యతలను విజయసాయిరెడ్డికి దూరం చేయబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఆయనతో పాటు మరో కీలక నేతకు కూడా జిల్లాల ఇన్ చార్జి బాధ్యతలను తప్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. వైవీకి కూడా ఉభయగోదావరి జిల్లా బాధ్యతలను తప్పించనున్నట్టు టాక్. ఈ ఇద్దరికీ పార్టీలో కేంద్ర కార్యాలయం ద్వారా రానున్న ఎన్నికలకు సంబంధించి తెరవెనుక కీలకమైన మరో పాత్ర ఇవ్వనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీలో పంచ పాండవులుగా నెంబర్ 2 పొజిషన్ లో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అయోధ్య రామిరెడ్డి,. సజ్జల రామకృష్ణారెడ్డిలు ఉండగా వీరిలో ముగ్గురుని ఆ పదవుల నుండి తప్పించబోతున్నారని సమాచారం. వారికి వేరే వేరే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట. అంటే వీరికి ప్రజా క్షేత్రానికి సంబంధించిన బాధ్యతలు కాకుండా వేరే బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. జిల్లా ఇన్ చార్జి బాధ్యతలను ప్రస్తుతం మంత్రి పదవులు కోల్పోతున్న కీలక మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించన్నారని సమాాచారం.. బాలినేని, పెద్దిరెడ్డి వంటి సీనియర్ మంత్రులకు పార్టీల ఇంచార్జిల బాధ్యతలు ఇవ్వనున్నట్టు అంతర్గతంగా వినిపిస్తుంది..!