స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు చలనచిత్ర మహానటుడు ఎన్టీఆర్ వెండి తెరపై ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లో సైతం ఎదురులేకుండా రానించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించారో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ…. ప్రతి పట్టణంలో నిలబెట్టిన ఆయన నిలువెత్తు విగ్రహాలే చెబుతాయి. అశేష ఆంధ్రావని ఆయనను కీర్తిస్తారు, గౌరవిస్తారు, మరి విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. అయితే ఇప్పుడు ఏపీ లో అక్కడా రాజకీయం మొత్తం ఈ విగ్రహం చుట్టూనే జరుగుతోంది.
పోలీసుల సాక్షిగా కూల్చివేశారు
నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ లోని ముసునూరు లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పోలీసుల సాక్షిగా వైసిపి నాయకులు పెకలించివేశారు. విగ్రహం చుట్టూ ఉన్న రక్షణ కూడా ధ్వంసం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడి హస్తం ఇందుకో ఉందని మరియు కేవలం కుట్రపూరితంగా తమ నాయకుడి విగ్రహం తొలగించారని తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తారు. ఇకపోతే వైసిపి నాయకులు మాత్రం గుడి కి అడ్డుగా ఉన్న దాన్ని తొలగించవలసి వచ్చిందని మరో చోట దీనిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని…. ఈ విషయాన్ని ముందే చెబితే తెదేపా వారు ఒప్పుకోలేదని అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తాము దానిని తొలగించి విగ్రహాన్ని అప్పగించినట్లు కూడా చెప్పుకొచ్చారు.
ఇది ఛాలెంజ్ ల సమయం….
ఇక ఈ వివరణ విన్న తర్వాత ఈ విషయంపై స్పందించిన నెల్లూరు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నందమూరి తారకరామారావు గారి విగ్రహం మళ్లీ ఇక్కడ పెట్టి తీరుతామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కి చాలెంజ్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయమై విచారణ చేయమని…. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు అంతా ముసునూరి కి వస్తారు అని చెప్పుకొచ్చినట్లు తెలిపారు.
ఇంకేముంది అక్కడ యుద్ధం మొదలైపోయింది
ఇక ఈ తతంగం మొత్తం తెలిసిన టిడిపి అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు విషయం తెలిసిన వెంటనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విగ్రహం తొలగింపుకి గల కారణాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఈ లోపల సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఇంకా ఈ విగ్రహం తొలగింపు వివాదం ఎంత వరకు వెళుతుందో…. రాష్ట్రంలో ఇలా విగ్రహ రాజకీయాలు ఎన్ని చోట్ల మొదలవుతాయో వేచి చూడాలి.