ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే మార్చి చివరికల్లా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రని పాతిక జిల్లాలుగా మార్చడానికి రెడీ అయిపోయారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు వైసీపీ లీడర్లకు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు అయింది. కొత్త జిల్లాల కాన్సెప్ట్ కి వైసీపీ ప్రజాప్రతినిధులంతా తలపట్టుకుంటున్నారట. లోక్ సభ సెగ్మెంట్ ల పరంగా కాకుండా వేరు వేరు డిమాండ్లు స్థానికుల నుండి వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పరిస్థితి మారినట్లు టాక్. కారణం చూస్తే విజయనగరం జిల్లా సగం వరకు ఏజెన్సీ ప్రాంతమే. మిగిలిన దాంట్లో సరైన ఉపాధి లేక చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పోతుంటారు.
రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన జిల్లాగా విజయనగరానికి మంచి పేరు ఉంది. అటువంటి చోట కొత్త జిల్లాల ప్రకటన వేడి పుట్టిస్తోంది. ఐటీడీఏ ప్రాంతమైన పార్వతీపురని జిల్లాగా మార్చాలన డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటు కాన్సెప్టు తెరపైకి రావడంతో ఈ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. వాస్తవానికి పార్వతీపురం, సాలూరు, కురుపం అరకు లోక్సభ పరిధిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో అరకును జిల్లా గా మార్చితే ఈ మూడు అటువైపు వెళ్లిపోతాయి.
అయితే స్థానికులకు ఇది ఇష్టం లేకపోవడంతో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు కి కొత్త జిల్లాల ఏర్పాటు తలనొప్పిగా మారిందని ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. తమని అరకులో కలపకుండా పాలకులను కూడా పరిగణలోకి తీసుకొని పార్వతిపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం స్థానికంగా కొంతమంది ప్రత్యేక జిల్లా సాధన కమిటీ అనేది ఏర్పాటు చేసి వైసీపీ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.