Sonu Sood: దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి సోనూసూద్ పేరు రోజు రోజుకి మారుమ్రోగుతోంది. గత ఏడాది లాక్ డౌన్ పెట్టిన సమయములో వలస కూలీలను తన సొంత ఖర్చుతో స్పెషల్ ట్రైన్స్, విమానాలు, బస్సులు ఏర్పాటు చేసి వాళ్ల ఇంటికి చేర్చారు. అక్కడితో ఆగిపోకుండా అనేక మంది పేద వాళ్ళ పిల్లలను చదివిస్తూ.. మరికొంత మందికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో కరోనా బారిన పడిన చాలా మంది రోగులు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.
ఇలాంటి సమయంలో కూడా సోనూసూద్ ప్రభుత్వాలు.. ముఖ్యమంత్రులు స్పందించని రీతిలో ఎదుటి మనిషి పట్ల మానవత్వం చూపుతూ తనవంతుగా ఆక్సిజన్ కొరతతో దేశవ్యాప్తంగా బాధపడుతున్న వారిని ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుండి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు చెప్పించిన సోనూసూద్.. తన సేవలు దేశవ్యాప్తంగా అందరికీ అందేలా ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయటం మాత్రమే కాక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. దేశంలో ఎటువంటి మారుమూల ప్రాంతం నుండి అయినా ఫోన్ చేస్తే చాలు ఈ టీం వెంటనే స్పందించి.. వారికి కావలసిన అవసరాలను తీరుస్తూ ఉంది. చాలామంది క్రికెటర్లకు మరియు సెలబ్రిటీలకు సోను సూద్ టీం స్పందించి.. అనేక మంది ప్రాణాలు నిలబెట్టే రీతిలో ఆక్సిజన్ సిలిండర్లను మరికొన్ని అవసరాలను తీరుస్తూ .. ప్రభుత్వాల కంటే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు.
కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో నిజంగా దేశంలో చాలా మంది హీరోలు ఉన్నా గాని రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్. ఈ నేపథ్యంలో ఈ రీతిగా ఆపద్బాంధవుడు గా మారిన సోనుసూద్ సేవలను సిల్వర్ స్క్రీన్ పై చూపించడానికి సినీ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వటానికి డైరెక్టర్ క్రిష్ రెడీ అయినట్టు సమాచారం. సోనుసూద్ పై సరికొత్త స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తీయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ సోనూసూద్ కి వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు సమాచారం. గతంలో క్రిష్ దర్శకత్వంలో సోనుసూద్ మణికర్ణిక సినిమా చేశారు.