అచ్చెన్నాయుడు… ప్రభాకర్ రెడ్డి… నారా లోకేష్.. చివరిగా చంద్రబాబు… ఇవన్నీ జగన్ కి రాజకీయ టార్గెట్లు. ఫిక్స్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అది సరే…! కానీ జగన్ సన్నిహితుల కళ్ళు, చెవులు ఇప్పుడు ఓ ఐఏఎస్ పై మాత్రం ఉన్నాయి. టిడిపిలోని మాజీ మంత్రుల లక్ష్యంగా జరుగుతున్నా రాజకీయ అరెస్టులు పక్కన పెడితే… జగన్ లక్ష్యంలో ఓ ఐఏఎస్ మాత్రం ఉన్నారు. అతనెవరు..? జగన్ అంతగా కోపం పెంచుకోడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందో కాస్త తెలుసుకుందాం…!
అది ఫిబ్రవరి 28 , 2017 . కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతం. హైదరాబాద్ నుండి విజయవాడ వస్తూ జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. పదకుండు మంది మరణించారు. జేసీ ట్రావెల్స్ బస్సు వస్తూ బోల్తాపడి తీవ్ర ప్రమాదానికి గురయ్యింది. 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. నాడు క్షతగాత్రులను పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ సహా పది మంది వైసిపి నేతలు వెళ్లారు. అక్కడ వివాదం జరిగింది. పోలీసులు వీళ్ళను అడ్డుకున్నారు. కృష్ణ జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకొని ప్రతిపక్ష నాయకులను నిలువరించారు. అక్కడే జగన్ కి బాగా మండింది. “నేను అందర్నీ గుర్తు పెట్టుకుంటాను. చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నారు. నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మీరు జైలుకి వెళ్తారు. నువ్వు కచ్చితంగా వెళ్తావు” అంటూ కలెక్టర్ అహ్మద్ బాబుని హెచ్చరించారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశమవ్వడం, జగన్ పై విమర్శలు చేయడం, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఏం జరిగిందంటే…!!
అక్కడితో ఆ సీన్ కట్ చేస్తే… తర్వాత బదిలీల్లో అహ్మద్ బాబు ఆర్టీజీఎస్ సిఈఓగా చేరారు. చంద్రబాబుకి , లోకేష్ కి సన్నిహితుడుగా పేరు పొందారు. కీలకమైన నిర్ణయాల్లో చంద్రబాబుకి తోడుగా ఉండేవారు. ఇలా.. ఇలా ఆర్టీజేఎస్ నుండి ఫైబర్ నెట్, ఐటీ విభాగాల్లో వేలు పెట్టారు. లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అహ్మద్ బాబు బాగా చక్రం తిప్పారు. కీలక నిర్ణయాల్లో నాటి ప్రభుత్వ నిర్ణయాల్లో ఈయన కీలకమే.
జగన్ కి దొరికినట్టేనా…!
ఆ సీన్ కట్ చేస్తే… ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ కేటాయింపులపై అంతర్లీనంగా విచారణ జరుగుతుంది. రూ. 333 కోట్ల విలువైన కాంట్రాక్టు కేటాయింపుపై జోరుగా దర్యాప్తు సాగుతుంది. ఇది లోకేష్ టార్గెట్ గా అంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. దీని వెనుకనే ఆర్టీ జేఎస్ లోని నాటి కీలక అధికారిగా ఉన్న అహ్మద్ బాబు టార్గెట్ గా కూడా పావులు కదులుతున్నాయి. అంటే… ఈ నిర్ణయాలను, ఆర్టీ జేఎస్ లో లోపాలను వెతికి తీయడం ద్వారా లోకేష్ సహా, అహ్మద్ బాబుని కూడా జైలు పంపించవచ్చు అనేది వైసిపి ప్రణాళిక. ఆరోపణలు, నోటి మాటల ద్వారా అయితే దాదాపు దొరికేసినట్టే. కాకపోతే పక్కా ఆధారాలు, కొన్ని దస్త్రాలు దొరకాల్సి ఉంది. అందుకే కొద్దీ వేచిచూపులు. అది జరిగితే జగన్ నాటి మాట “నిన్ను అరెస్టు చేయిస్తా” అనేది నెరవేరినట్టే.