Jangareddygudem Deaths: సహజ మరణాలని ప్రభుత్వం గట్టిగా చెబుతుంది.. (ప్రభుత్వం చెప్తున్నది నమ్మాలంటే.. అక్కడ కేవలం పురుషులు మాత్రమే మరణించారు. మరణించిన అందరికీ నాటుసారా తాగే అలవాటు ఉంది. ఒకరిద్దరికి తప్ప వేరే ఎవ్వరికీ ఎటువంటి రోగాల్లేవు..)
కాదు, కాదు నాటుసారా మరణాలేనని ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుంది..
(పోనీ ప్రతిపక్షం చెప్పింది నమ్మాలంటే.. నాటుసారా తాగడం ఆ ప్రాంతంలో కొత్తకాదు. నాటుసారా తాగితే ఇంత దారుణంగా మరణాలు జరగవు..!)
జంగారెడ్డిగూడెంలో అసలు ఏం జరిగింది..!? ఆ మరణాలకు కారణాలేమిటి..!? రెండు రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఎందుకు చనిపోయారు..? అసలు ఆ మరణానికి ముందు ఆ బాధితులు పడిన ఇబ్బందులు ఏమిటి..!? ఆ కుటుంబాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి..!? ఈ అంశాలన్నిటినీ “న్యూస్ ఆర్బిట్” బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. మరణించిన బాధిత కుటుంబాలతో మాట్లాడింది. అసలు కారణాలను అన్వేషించింది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది.!
Jangareddygudem Deaths: ఒక అబద్ధం.. మళ్ళీ మళ్ళీ అదే చేసేలా..!!
జంగారెడ్డిగూడెంలో మొదట ఈ నెల 9, 10 తేదీల్లో 15 మంది మరణించారు. ఒకరి తర్వాత ఒకరు.. 15 మంది మరణించే వరకు విషయం బయటకు రాలేదు.. ఆ వార్త బయటకు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే నివేదిక పంపించాలంటూ ఆదేశించారు.. అప్పటికప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించక.. నాటుసారా అంటే పెద్ద ఇష్యూ అవుతుందనే కొనాలో స్థానిక అధికారులు ఈ విషయం సీరియస్ నెస్ ఆపేయాలని ఉద్దేశంతో “సహజ మరణాలు” అంటూ నివేదిక ఇచ్చేసారు.. కానీ అప్పటికే నాటు సారా వల్లనే ఈ మరణాలు జరిగాయని స్థానికులు, అక్కడి వైద్యులు అనుకున్నారు. కానీ అధికారులు భయపడి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. “నాటు సారా వల్ల వారు చనిపోలేదు. వేరువేరు కారణాల వల్ల చనిపోయారు” అని జిల్లా అధికారులకు స్థానిక అధికారులు నివేదిక ఇచ్చారు. జిల్లా అధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. స్థానిక అధికారులు చెప్పిన నివేదికనే ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే అవి సహజ మరణాలుగా పేర్కొంటూ వస్తోంది. సాక్షాత్తూ సీఎం జగన్ కూడా అదే విషయానికి కమిట్ అయ్యారు.. కానీ క్షేత్ర స్థాయిలో 16 సంవత్సరాల వయసు వారి నుండి 60 సంవత్సరాల వయసు వృద్ధుడి వరకూ ఈ 22 మంది ఎలా చనిపోయారు..? అని ప్రశ్నిస్తే నాటు సారా వల్ల చనిపోయారు అని చెబుతున్నారు. స్థానికంగా టీడీపీ వాళ్లతో పాటు వైసీపీ వాళ్లు కూడా వాళ్లు నాటు సారా వల్లనే చనిపోయారు అని పేర్కొంటున్నారు.
Jangareddygudem Deaths: అక్కడే తప్పటడుగు..!?
క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఈ విధంగా సహజ మరణాలు అని ఎందుకు చెబుతుంది అంటే.. స్థానిక అధికారుల నుండి మొదట వచ్చిన నివేదికకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు ఒక వేళ ప్రభుత్వం ఇవి నాటు సారా మరణాలే అని ఒప్పుకుంటే ఇప్పటి వరకూ ఆవి నాటు సారా మరణాలు అని చెబుతూ వచ్చిన టీడీపీ వాదనకు బలం చేకూరినట్లు అవుతుందని, రాజకీయంగా ఆ క్రెడిట్ వాళ్లకు వస్తుందని ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితిలో ఇవి నాటు సారా మరణాలు అని ప్రభుత్వం దృవీకరిస్తే ప్రతిపక్షానిది పైచేయి అవుతుంది.. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. సహజ మరణాలు అని కట్టుబడి ఉంటే ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు.. వాస్తవానికి “వీళ్లందరూ కూడా నాటు సారా వల్ల చనిపోయారు” అని ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే.. బాధిత కుటుంబాల నుండి ప్రభుత్వ అధికారులు తీసుకున్న వాగ్మూలంలో వాళ్లు స్పష్టంగా “నాటుసారా తాగి ఇంటికి వచ్చాక ఇలా అపస్మారక స్థితికి గురై.. మరణించారు” అని ఆ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు వారి నుండి తీసుకున్న స్టేట్ మెంట్ లో కూడా నాటు సారా వల్ల చనిపోయినట్లే రాసుకున్నారు. అంతర్గతంగా ప్రభుత్వానికి వచ్చిన నివేదికల ప్రకారం నాటు సారా మరణాలు అని తేలుతున్నా సహజ మరణాలుగానే ప్రభుత్వం వెల్లడిస్తోంది.
సారా తాగితే చనిపోరు.. కానీ..!
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. నాటు సారా వల్ల ఎవరు చనిపోరు. నాటు సారా ఊట బెల్లంతో తయారు చేస్తారు. ఇది నిజానికి పెద్దగా హాని కరం కాదు. మత్తు ఇస్తుంది. కిక్ ఇస్తుంది కానీ వెంటనే మరణాలు సంభవించే అవకాశం ఉండదు. కానీ ఆరు రెండు మూడు రోజుల్లోనే నాటు సారా తాగిన వాళ్లు ఎందుకు చనిపోయారు అంటే.. రుచి కోసమో లేక మత్తు ఎక్కువ వచ్చేందుకో ఇంకా ఏదైనా నాటుసారాలో కలిపి ఉండవచ్చు. అలా కలపడం వల్ల ఆ రెండు మూడు రోజుల్లో తాగిన వాళ్లు మృత్యువాత పడ్డారు. ఈ అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం, బూట్టాయిగూడెం తదితర ఏజన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నాటు సారు దొరుకుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏనాడూ ఇలా చనిపోలేదు. కానీ ఇప్పుడే ఎందుకు చనిపోయారు అంటే ఆ తయారీ దారుడు ఏదో కలపడం వల్ల అది తాగిన వాళ్లు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. ఇవి సహజ మరణాలు కాదు అన్న విషయం అందరికీ తెలుసు. ఇవి నిజంగా సహజ మరణాలు అయితే ఏ అనారోగ్యం లేకుండా బైక్ మెకానిక్ గా పని చేస్తున్న 37 సంవత్సరాల వయసు ఉన్న అనిల్ అనే వ్యక్తి ఎందుకు చనిపోయాడు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సహజ మరణాలు అయితే మహిళలు కూడా చనిపోతారు కదా కేవలం పురుషులే ఎందుకు చనిపోతారు అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. చనిపోయిన వాళ్లు అందరూ సారా తాగే అలవాటు ఉన్న వాళ్లే కావడం గమనార్హం.