గ్రానైట్ లో ఆక్రమాలపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది. మొత్తం 19 లీజుదారులకు రూ. 2085 కోట్లు ఫైన్ వేసింది. ఇది పది నెలల కిందటి విషయం..! (ఈ వార్త విని చంకలు గుద్దుకున్న నిఖార్సైన వైసీపీ అభిమానులకు మళ్ళీ ఈరోజు అటువంటి సంఘటనే ఎదురయింది..!)
గ్రానైట్ క్వారీల్లో అక్రమాలకూ పాల్పడుతున్నారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులకి చెందిన లీజులను రద్దు చేసారు…! (వహ్వా..! అవినీతి ఆట కట్టించారని చంకలు గుద్దుకుందామా..?)
అంటే లీజు దారుల పాపలు.., తవ్వకాల్లో బొక్కలు బయటపెట్టిన పది నెలల తర్వాత ఇద్దరి లీజులు రద్దు చేసారు. అవి కూడా ఫక్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళవి రద్దు చేసి పడేసారు. ఈ పది నెలల్లో గ్రానైట్ పేరిట నడిపిన రాజకీయం తెలిసిన తర్వాత చంకలు గుద్దుకుంటారో.., భుజాలు తడుముకుంటారో.. ఎవరిష్టం వాళ్ళది..!!
ఆ లీజులు – పాపాలు సింపుల్ గా…!!
ప్రకాశం జిల్లాలో మొత్తం మీద చీమకుర్తిలో 2 వేల ఎకరాల్లో… బల్లికురవలో 700 ఎకరాల్లో క్వారీల్లో గ్రానైట్ తవ్వకాలు జరుగుతుంటాయి. 20 ఏళ్లుగా బాగా నోట్లు, కోట్లు వచ్చి చేరడంతో గ్రానైట్ వ్యాపారుల్లో చాలా మంది రాజకీయాల్లో చేరారు. అప్పుడప్పుడూ తనిఖీలు, దాడులు జరిగేవి, రొటీన్ ప్రాసెస్ లో భాగంగా చెల్లింపులు ఇచ్చుకుని మళ్ళీ అంతా సాధారణ స్థితికి వచ్చేది. కానీ…!! 2019 లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాపపు చిట్టాను బయటకు తీసి ఫైన్ వేశారు. “ప్రతి క్వారీ లీజులు, లెక్కలు, పత్రాలు, కొలతలు, అమ్మకాలు, పన్నులు” అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రూ. 2085 కోట్లు ఫైన్ వేశారు.
ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో జై కొట్టారు…! కానీ..!!
గ్రానైట్ ఫైన్ లు విపరీతంగా పడడంతో వాటినుండి తప్పించుకునే క్రమంలో జిల్లాలో చకచకా రాజకీయ మార్పులు జరిగిపోయాయి. అవేమిటంటే…!
* మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుకి చెందిన లీజులు అన్నిటికీ కలిపి రూ. 290 కోట్లు వరకు ఫైన్ వేశారు. మొదట శిద్ధా కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకుని, తాత్కాలికంగా ఉపశమనం పొందారు. తర్వాత కూడా తనిఖీలు చేసి, క్వారీలు ఆపేయడంతో చేసేదేం లేక వైసిపిలో చేరిపోయారు. ఇప్పుడు చక్కగా క్వారీయింగ్ చేసుకుంటున్నారు. (ఈయన మనస్ఫూర్తిగా పార్టీ మారలేదు. ఈయన చేసిన రోజు కూడా ఎవరితో చర్చించలేదు. జగన్ ని కలిసి, పార్టీలో చేరి, నేరుగా ఇంటికి వెళ్లి ౨౦ రోజులు బయటకు రాలేదు)
* శిద్ధా కుటుంబానికే చెందిన సూర్యప్రకాశరావు, శిద్ధా హనుమంతరావులు ఆపిల్, చంద్రిక పేరిట క్వారీలు నిర్వహిస్తున్నారు. వీరికి రూ. 145 కోట్లు ఫైన్స్ వేశారు. వీరిద్దరూ ఈ ఏడాది మార్చిలోనే వైసిపిలో చేరిపోయారు. శిద్ధా వెంకటేశ్వరరావు సంస్థలకు దాదాపు రూ. 420 కోట్లకి పైగా ఫైన్ వేశారు. ఈయన కోర్టుకి వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు. అక్కడి క్వారీల్లో అత్యధిక ఆదాయం వచ్చే వాటా ఈయనకు ఉంది. అందుకే కొంత అనధికార లావాదేవీల ద్వారా బయటపడ్డారు.
* ఇక పెరల్ క్వారీలకు రూ. 204 కోట్లు ఫైన్ వేశారు. పెరల్ మినరల్స్ పేరిట (పల్లవ , రెడ్ ) అనే రెండు క్వారీలను రాజా నిర్వహిస్తున్నారు. ఈయన రాజకీయాలకు అతీతంగా ఉంటున్నారు. ఈయన క్వారీల్లో కొంత వాటాని అధికార పార్టీలో ఓ వ్యక్తి బంధువులకు వాటాగా ఇచ్చారని వినికిడి.
* చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులకు కెబి రాక్స్ పేరిట క్వారీలు ఉన్నాయి. వీరి సంస్థలకు రూ. 33 కోట్లు ఫైన్ వేశారు. ఇది జరిగిన నెల రోజులకు బలరాం వైసీపిలో చేరిపోయారు. ప్రస్తుతానికి ఈ లీజుకి సంబంధించిన విచారణ, ఫైన్ విషయం పక్కకు వెళ్ళింది.
* ఇక గరికపాటి రామ్మోహనరావు (టీడీపీ నుండి బీజేపీకి వెళ్లారు).., నామా నాగేశ్వరరావులకు చెందిన క్వారీలకు ఫైన్ లు పడ్డాయి.
జై కొట్టలేదు/ కొట్టనీయలేదు..! లీజు పోయింది…!!
ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కిషోర్ గ్రానైట్స్, కామేపల్లి గ్రానైట్స్ పేరిట క్వారీలు నిర్వహిస్తున్నారు. అర్చన గ్రానైట్స్ లో సగం వాటా ఉంది. ఈయన క్వారీలకు రూ. 280 కోట్లు వరకు ఫైన్ వేశారు. కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని బయటపడ్డారు. మళ్ళీ తనిఖీలు, నోటీసులతో కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇక డ్రామాకి తెరదించి చివరిగా లీజుల్లో లోపాలు, తవ్వకాల్లో అవినీతి అంటూ లీజుకి రద్దు చేసేసారు. గొట్టిపాటి వైసిపిలో చేరలేదు. జగన్ అంగీకరించలేదనో.., లేదా ఈయనకు నచ్చలేదనో మొత్తానికి ఆగిపోయారు. తాజాగా ఈయన లీజుకి పెద్ద దెబ్బ పడింది. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీ లీజు కూడా రద్దు చేశారు.
కీలక చర్చ ఏమిటంటే…!!
ఇప్పుడు చివరిగా కొన్ని నిజాలు మాట్లాడుకోవాలంటే..! తనిఖీలు ఎందుకు చేసినట్టు..? ఫైన్ ఎందుకు వేసినట్టు..? ఎవరిది తప్పు..? ఎవరిదీ ఒప్పు..? ఒకే తరహాలో అవినీతి చేసిన క్వారీల్లో ఒక్కొక్కరికీ ఒక్కో తరహా ట్రీట్మెంట్. పార్టీలో చేరిన తర్వాత వైఖరి మారడం. తనిఖీలు ఆగడం..! ఇలా జిల్లాలోనూ, ఆ వర్గాల్లోనూ ఇదే తరహా చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల ద్వారా నిజానికి జగన్ వ్యక్తిత్వం, రాజకీయం తెలిసిన వారు “వైసిపిలో చేరి ఇక మేము సేఫ్” అనుకోడాని లేదు అనేది జరగుతున్న చర్చ. “వీళ్ళు తమ తప్పులు కప్పుకోవడానికి మాత్రమే వైసీపీ కండువా వేసుకున్నారని.., అదను చూసి వెళ్ళిపోతారని” జగన్ కి బాగా తెలుసు. అందుకే ఎక్కడ పెట్టాలో, అక్కడే పెట్టి… తాను అనుకున్న సమయంలో వీళ్లకు రుచి చూపిస్తారు అనేది జగన్ సన్నిహితుల వాదన..! లేదు “వైసీపీకి జై కొట్టేశారు. ఇక ఏమి లేదు, తప్పులన్నీ కడిగేశారు. చీకట్లో సర్దుబాట్లు చేసేసారు” అనేది జగన్ వ్యతిరేక వర్గాల వాదన. ఏది ఏమైనా “ఈ ఫైన్ ల వ్యవహారం అంతా ఇంకా సద్దుమణగలేదు. వైసిపిలో చేరిన వారికి ఒత్తిడి తగ్గింది, క్వారీలు నడుస్తున్నాయి. టీడీపీలో ఉన్న వారికి లీజులు రద్దయ్యాయి. కానీ అందరికీ ఫైన్లు అలాగే ఉన్నాయి. అది ఎలా తేలుతుంది, ఈ వ్యవహారానికి జగన్ ఎలా ముగింపు పలుకుతారు..? అనేది సగటు ప్రశ్న..!!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!