వర్షాకాలం వచ్చేసింది. ప్రకృతికి అందాలు తెచ్చింది. అయితే, ఆ అందాలతో పాటు మరెన్నో సీజనల్ వ్యాధులను కూడా మన కోసం తెస్తుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. గత వారం రోజులుగా వాతావరణ పరిస్థితి పూర్తిగా మారింది. చల్లబడిన వాతావరణం కారణంగా ఎన్నో రకాల వైరస్లు విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ పదిమందిలో ముగ్గురు లేదా నలుగురికి జలుబు, ఇద్దరు లేదా ముగ్గురికి జ్వరంతో కూడిన వైరల్ ఇన్ ఫెక్షన్లు వస్తూ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
వైరల్ ఫీవర్లు అకస్మాత్తుగా వ్యాపిస్తాయి. ఫీవర్ వచ్చినప్పుడు ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం లేదా అంతకంటే ఎక్కువ కూడా రావొచ్చు. అలాగే, విపరీతమైన తలనొప్పి, ఒల్లు నొప్పలు వచ్చి రోగి బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. కొందరిలో శరీరం మీద దద్దుర్లు ఏర్పడతాయి. వాంతులు, అరుదుగా విరేచనాలు కూడా అవుతుంటాయి. మరి కొందరిలో అయితే ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే జ్వరాలు సోకుతున్నాయి. వీటినే విష జ్వరాలు అంటారు. కొన్ని విష జ్వరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వాటికి వైద్యం తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు సైతం కోల్పోయే ప్రమాదమేర్పడుతుంది.
వైరల్ ఫీవర్ గాలి ద్వారా సోకుతుంది. ఇవి ఒకరినుంచి మరొకరి
వ్యాపిస్తాయి. కొన్ని సార్లు శ్వాసనాలాల ద్వారా కూడా వ్యాపిస్తాయి. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు ఈ వైరల్ ఫీవర్లు సోకుతాయి. ఈ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు ఎక్కువగా పిల్లలకు సోకే ప్రమాదముంది. వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం, నిస్సత్తువ, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి నుంచి విముక్తి లభించడానికి కేవలం మందులు మాత్రమే ఉపకరిస్తాయి. వైరల్ ఫీవర్ వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. నరాల మీద ఎటాక్ చేయడం మూలంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వీటితో రోగ నిరోధకత మెరుగు
వైరల్ ఫివర్ బారినపడినప్పటికీ.. త్వరగా కోలుకోవడంతో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు పండ్లు బాగా తినిపించినట్టయితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతి ఫలాలు ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లను దూరం చేయవచ్చు. అలాగే ఆలివ్ ఆయిల్ నుంచి కూడా ఈ ఇన్ఫెక్షన్ నుంచి దూరం చేయవచ్చు. పిల్లల్లో అయినా, పెద్దల్లో అయినా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ రాయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే కలబంద రసం లేదా జామ ఆకు రసాన్ని నుదిటిపై రాయడం వల్ల శరీర వేడిని తగ్గించవచ్చు. అలాగే రోగికి గోరు వెచ్చటి నీటితో స్నానం చేయించడం వలన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉండి జ్వరం తగ్గుతుంది. సీజనల్ వ్యాధుల బారినపడకుండా పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, మరీ ముఖ్యంగా పిల్లలను ఎప్పటికప్పుడు పరీశీలిస్తుండాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.