ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నారు. సహజ సిద్ధంగా లభించే చిరుధాన్యాలను వదిలేసి, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ప్రాధాన్యత చూపిస్తున్నారు. ఈ విధమైన ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఊబకాయం, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విధమైన అనారోగ్య సమస్యలకు సజ్జలు తినడం చక్కని పరిష్కార మార్గమని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సజ్జలు మన ఆహారంలో ఒక భాగంగా తీసుకోవటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
సజ్జలు చూడడానికి చిన్నవిగా ఉన్నా పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల సజ్జలలో 3 మిల్లీగ్రాముల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు సజ్జలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. సజ్జల లో ఎక్కువ శాతం విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణం అవడంతో తొందరగా ఆకలి అనిపించదు.ఇది శరీర బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మధుమేహ సమస్యతో బాధపడేవారు సజ్జలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల వారి శరీరంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం మొలకెత్తిన సజ్జల ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎదిగే పిల్లల్లో సజ్జలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. సజ్జలు అధిక శాతం ఐరన్ ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలు, సజ్జలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి గర్భంలో ఎదిగే పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా మన శరీరానికి అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేస్తూ ఎల్లప్పుడూ చురుగ్గా ఉండేలా చేయడానికి సజ్జలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.