డెంగ్యూ అంటేనే జడుసుకునే జనాలున్నారు. దాని తీవ్రత అంతగా ఉంటుంది మరి. మరీ ముఖ్యంగా వర్షకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ తీవ్రత మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. వానలు పడటంతో చుట్టుప్రక్కల వాతావరణం పచ్చగా మారడం మొదలుపెడుతుంది. దానితో దోమలు స్వైర విహారం చేయడం మొదలు పెడతాయి. దీనితో పాటు చెత్త ద్వారా కూడా దోమల బెడద మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
డెంగ్యూ వ్యాధి ఈడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. దీని బారిన పడి చాలా మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నవాళ్లున్నారు. తరచుగా జ్వరం రావడం, కీళ్ల నొప్పులు, విపరీతమైన తలనొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దురద ఉంటుంది. డెంగ్యూ సోకిన వారిలో కొంతమందికి డెంగ్యూ హెమరేజిక్ జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు.
ఈ లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జ్వరం తీవ్రత ఒక్కో సారి 105 డిగ్రీల వరకు కూడా ఉండవచ్చు. దీనితో జ్వరం అధికంగా ఉంటే అది కరోనా అని చాలా మంది భావిస్తుంటారు. కాని అది కాకపోవచ్చంటున్నారు నిపుణులు. డెంగ్యూ వ్యాధి కూడా కావొచ్చు. అధిక జ్వరంతో బాధపడుతుంటే శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తూ అది స్థిరంగా ఉందా లేదా పెరుగుతుందా అన్నది చూడాలి. ముఖ్యంగా డాక్టర్ ను సంప్రదించి అది డెంగ్యూనా లేక కరోనా అని టెస్ట్ చేయించుకోవాలంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వచ్చిన వారు త్వరగా అలసిపోతుంటారు. ఏ చిన్న పని చేసినా అలసిపోతారు. ఆకలి వేయదు. రుచిని గ్రహించలేరు. అలాగే డెంగ్యూ వచ్చిన వారిలో బీపీలో తగ్గుదల ఉంటుంది. ఇది గమనిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి లక్షణాలన్నీ కొన్ని కేసుల్లో మాత్రమే కనిపిస్తాయి. అన్ని కేసుల్లో ఇవి కనిపించకపోవచ్చు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకపోతే ప్లేట్ లేట్స్ తగ్గి ప్రాణాలమీదికే రావచ్చు. దోమలు తమ పరిధిలోనికి రాకుండా చర్యలు తీసుకోవడం మంచిది.