విటమిన్ డి.. కరోనా కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అవును.. కరోనా సోకకుండా ఉండాలంటే మనిషి శరీరంలో తగినంత విటమిన్ డి ఉండాలి. విటమిన్ డి సరిపోయేంత ఉంటే.. రోగ నిరోదక శక్తి పెరిగి కరోనా వైరస్ దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
ఏ విటమిన్ కూడా మనకు ఉచితంగా దొరకదు కానీ.. ఒక్క డి విటమిన్ మాత్రం ఉచితంగా దొరుకుతుంది. ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడితే చాలు.. ఆరోజుకు కావాల్సినంత విటమిన్ డి శరీరానికి అందుతుంది.
అంతే కాదు.. పలు రకాల ఆహార పదార్థాల్లోనూ విటమిన్ డి ఉంటుంది. చేపలు, గుడ్లు, మాంసం, పాలు, పుట్టగొడుగులు లాంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
అయితే… ఈ విటమిన్ డి శరీరానికి ఎంత కావాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువైందనుకోండి లేనిపోని రోగాలను మనమే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది.
విటమిన్ డి తక్కువున్నా ప్రమాదమే.. ఎక్కువ అయినా ప్రమాదమే. ఒకవేళ విటమిన్ డి ఎక్కువైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం రండి..
కిడ్నీ సమస్యలు
విటమిన్ డి మోతాదు మించితే కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కిడ్నీల్లో వచ్చే పలు వ్యాధులు విటమిన్ డి ఎక్కువవడం వల్లనే. ఒకవేళ కిడ్నీ సమస్యలు ముందే ఉంటే.. డాక్టర్ సలహాతోనే విటమిన్ డి సప్లిమెంట్స్ ను వాడాలి.
జీర్ణ సంబంధ సమస్యలు
మానవ శరీరంలో విటమిన్ డి ఎక్కువయిందంటే.. కడుపునొప్పి వస్తుంది. దానితో పాటు మలబద్ధకం సమస్య వస్తుంది. వీటి వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణమవకపోవడం లాంటి సమస్యలు వస్తాయి.
హైపర్ కాల్సేమియా
నిజానికి విటమిన్ డి ఎక్కువైతే శరీరంలో కాల్షియం లేవల్స్ కూడా పెరుగుతాయి. దాన్నే హైపర్ కాల్సేమియా అంటారు. కాల్షియం ఎక్కువ అవడం వల్ల ఆకలి తగ్గి మలబద్ధకం సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని వల్ల అధిక రక్తపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
వాంతులు
విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం ఎక్కువవుతుందని తెలుసుకున్నాం కదా. శరీరంలో ఉండే అధిక కాల్షియం వల్ల వాంతులు, వికారంగా అనిపించడం, ఆకలి మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. ఎప్పుడూ వాంతి చేసుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది.
ఎముకలు వీక్ అవడం
మన శరీరంలో ఎముకల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అవి దృఢంగా ఉంటేనే మనిషి దృఢంగా ఉంటాడు. అయితే విటమిన్ డి సరిపోయేంత ఉంటేనే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఒకవేళ విటమిన్ డి ఎక్కువైతే కూడా ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఎముకలు గట్టిగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత విటమిన్ డిని మాత్రమే తీసుకోవాలి.