ప్రపంచం మొత్తం ఒకే ఒక్క మంచి మాటను చాలా త్వరగా వినాలనుకుంటుంది.. అదే కరోనాకు వాక్సిన్ కావాలనీ.. కరోనా రాకతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ప్రజల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఇంతలా వేధిస్తున్న కరోనాను ప్రపంచం నుంచి తరిమేసేందుకు చాలా దేశాలు శ్రమిస్తూ వస్తున్నాయి. అందుకోసం చాలా డబ్బును ఖర్చు చేస్తున్నాయి. ఈ వాక్సిన్ తయారీని చాలా సంస్థలు చేస్తున్నప్పటికీ.. కొన్ని సంస్థలు చేసే పరిశోధనలు ఆశ జనకంగా ముందుకు సాగుతున్నాయి.
ఈ తయారీలో ఆస్ట్రాజెనికా- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచంలోని పలు దేశాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఫలితాలు అశాజనకంగా ఉన్నట్లు పలు పరిశోధనలు తెలపుతున్నాయి. ఈ వ్యాక్సిన్ కరోనాతో ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్న పెద్దవారిలోనూ సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక తెలిపింది. ముసలివారిలో యాంటీబాడీలు, టి-కణాలను టీకా ప్రేరేపించినట్లు కనుగొన్నారని నివేదికలో పేర్కొన్నారు.
18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతుల్లో టీకా బలమైన రోగనిరోధకాలను ఉత్పత్తి చేసినట్లు జులైలో విడుదల చేసిన ఫలితాలు తెలియజేస్తున్నాయని పేర్కొంది. ఇమ్యునోజెనిసిటీ పరీక్షల ఫలితాల గురించి ఇప్పటికే తెలుసని పేర్కొంది.
టీకా అంతిమంగా వృద్ధుల్లో సురక్షితమని పాజిటివ్ ఇమ్యునోజెనిసిటీ పరీక్షలు హామీ ఇవ్వలేదని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి ఫలితాలను ఒక క్లినికల్ జర్నల్లో త్వరలోనే ప్రచురించే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఈ విషయంపై ఇంకా ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెన్కాలు స్పందించలేదు.
ప్రయోగదశల్లో ఉన్న ఈ టీకా జెనెటిక్ సూచనలు పాటిస్తుందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు బ్రిస్టల్ యూనివర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్ చేపట్టారు. రోగ నిరోధకతను ఏవిధంగా ఉత్తేజపరుస్తుందోననే విషయాలు పూర్తి వివరాలతో తెలుసుకున్నారు. ఈ ఫలితాలను రిసెర్చ్ స్క్వేర్ జర్నల్లో ప్రింట్ చేశారు.
ఈ టీకా శరీరంలోకి వెళ్లిన తర్వాత జన్యు సూచనలను పాటిస్తుందా ? లేదా ? అనే విషయం తెలుసుకోవడంలో ఈ రీసెర్చ్ ఎంతో ముఖ్యమైందని సీఎంఎం వైరాలజీ సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ మాథ్యూస్ తెలిపారు. ఇది సక్సెస్ అయితే.. ప్రపంచం కోరుకుంటున్న వాక్సిన్ వచ్చినట్లేనని పరిశోధకులు తెలుపుతున్నారు.