Congress: జాతీయ స్థాయిలో తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి నూతన జవ సత్వాలను నింపి ప్రాంతీయ పార్టీల కూటమి లాంటి జాకీలతో కాంగ్రెస్ పార్టీని లేపి ఎలాగోలా అధికారంలోకి తీసుకురావాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాహాలకు పదునెక్కక ముందే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరుగా గుడ్ బై చెబుతూ ఆ పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.
Congress: సుస్మితా దేవ్ బాటలో..
రెండు రోజుల క్రితం సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ఆకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. మహిళా కాంగ్రెస్ ఆల్ ఇండియా అధ్యక్షురాలుగా ఉన్న సుస్మితా దేవ్ పార్టీని వీడటం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ షాక్ నుండి కాంగ్రెస్ పార్టీ తేరుకోకమునుపే మరో సీనియర్ నేత, త్రిపుర కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పిజూష్ కాంతి బిస్వాస్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. “త్రిపుర పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా నా హయాంలో సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మద్దతుదారులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రోజు నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. రాజకీయాల నుండి కూడా విరమణ తీసుకుంటున్నా. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి హదయపూర్వక ధన్యవాదాలు” అంటూ నిన్న ట్వీట్ చేశారు.
బిస్వాస్ టీఎంసీ గూటికేనా..?
అయితే ఈ ట్వీట్ పై ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన సుస్మితా దేవ్ స్పందించారు. “మన హయాం కఠినంగా ఉంది. భవిష్యత్తుకు గుడ్ లక్” అని ఆమె పేర్కొన్నారు. దీంతో బిస్వాస్ కూడా టీఎంసీ గూటికి చేరనన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాలపై స్పందించడానికి నిరాకరించిన బీజేపీ..ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు.