Puducherry : పుదుచ్చేరిలో నారాయణ స్వామి ప్రభుత్వం బలనిరూపణకు ముందే కుప్పకూలింది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో నేటి సాయంత్రం బల నిరూపణ ఎదుర్కోవాల్సి ఉన్న సీఎం నారాయణస్వామి రాజీనామా లేఖ తో రాజ్ భవన్ కు చేరుకున్నారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా గతంలో కాంగ్రెస్, డిఎంకె, స్వతంత్ర అభ్యర్ధి తో కూడిన 18 మంది సభ్యుల బలం తో నారాయణస్వామి ప్రభుత్వం ఏర్పాటు అయింది.
ఇటీవల మంత్రి సమ శివాయం, ఎమ్మెల్యే తిపాయన్ దాస్ రాజీనామా చేసి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ రాజీనామా చేశారు. దీంతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనార్టీ లో పడింది. తాజాగా నిన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతో అసెంబ్లీ కూటమి బలం 12 కు తగ్గింది. దీంతో నారాయణస్వామి రాజ్ భవన్ కు చేరుకొని లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు రాజీనామా లేఖ అందజేశారు. నేటి సాయంత్రం ఐదు గంటలకు బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉన్న తరుణంలో సిఎం నారాయణస్వామి రాజీనామా చేశారు.