ప్రధాన మంత్రి (పీఎం) భద్రతలో మరో సారి వైఫల్యం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ నివాసం వద్ద ఓ డ్రోన్ ఎగరడం కలకలాన్ని రేపింది. సోమవారం వేకువజామున 5.30 గంటల ప్రాంతంలో ఓ అనుమానాస్పద డ్రోన్ ప్రధాని నివాసంపై సంచరించినట్లు ఎస్పీజీ నుండి సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎస్పీజీ ఇచ్చిన సమాచారంపై దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధాని అధికారిక నివాసం ఉంది. ప్రధాని నివాసం వద్ద నో ఫ్లై జోన్ అమల్లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి డ్రోన్ రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి డ్రోన్ ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదని సమాచారం. ప్రధాని నివాస పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామనీ, ఇప్పటి వరకూ ఎలాంటి డ్రోన్ తరహా వస్తువు కనిపించలేదనీ, ఎయిర్ ట్రాఫిక్ రూమ్ ను కూడా సంప్రదించామని, ప్రధాని నివాసం వద్ద ఎలాంటి ఎగిరే వస్తువులు గుర్తించలేదని వారు చెప్పారని ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకు ముందు ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లిన సమయంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా ఓ అనుమానాస్పద డ్రోన్ సంచరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఢిల్లీ సీఎం నివాసం కూడా నో ఫ్లై జోన్ లోనే ఉంది.
Suicide: తాడిపత్రి సీఐ ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?