Supreme Court: దేశంలో వివిధ చట్ట సభల్లో సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను సత్వరం పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేసుకోవాలని కోరింది. మరో ఆరు నెలల్లో సార్వ్తత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలను వేగంగా పూర్తి చేసేందుకు కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేయాలని.. క్రిమినల్ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశించింది.
ట్రయల్ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది. కేసుల వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుండి సేకరించి హైకోర్టు వెబ్ సైట్ లో ప్రత్యేక ట్యాబ్ ఏర్పాటు చేసి అందులో పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.