Corona : కరోనా… ఇప్పుడు అందర్నీ కలవరపెడుతున్న అంశం. కరోనా సెకండ్వేవ్ ఇప్పుడు ప్రజలను వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ రికార్డులను అన్నింటిని తుడిపెట్టే విధంగా కోవిడ్ విజృంభిస్తోంది. దీంతో మునుపెన్నుడూ లేని విధంగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, దీని కేంద్రంగా రాజకీయ విమర్శలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై కరోనా వైరస్ సెకండ్ వేవ్ కేంద్రంగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన సంచలన ఆరోపణలు చేసింది.
శివసేన సంచలన ఆరోపణలు…
శివసేన పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనే కోవిడ్ సెకండ్ వేవ్కు బాధ్యత వహించాలని శివసేన డిమాండ్ చేసింది. ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచే కోవిడ్ కేసులు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయని విరుచుకుపడింది. మరోవైపు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ పాలకులు మహమ్మారి వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించిన ఆ పార్టీ.. దేశంలో పలు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతతో పాటు మందులు కూడా లభించని పరిస్థితి ఉంటే.. కేంద్ర మాత్రం.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో బిజీగా ఉందని ఎద్దేవా చేసింది. ఇప్పటికైనా రాజకీయాలను పక్కనపెట్టి మహమ్మారి కట్టడిపై కేంద్ర సర్కార్ దృష్టిసారించాలన్న శివసేన.. సెకండ్ వేవ్ కు మాత్రం కేంద్రం, ఈసీల తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ సీఎం కూడా …
తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వ ఆధీనంలోనే కాకుండా.. బహిరంగ మార్కెట్లో కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. దీంతో కోవిడ్ టీకాలు కావాలనుకున్న వారు కొనుగోలు చేసుకుంటారని దీని మూలంగా.. ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయి.. అణగారిన వర్గాలపై ఎక్కవ ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన కరోనా టీకాలను అందరికీ అందబాటులోకి తేవడం కోసం చర్యలు చేపట్టాలని లేఖలో ప్రధానిని కోరారు సీఎం నవీన్ పట్నాయక్.. ఇక, వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు సహకరించాలన్నారు.