ఏపీ అధికార వైసీపీలో ఇప్పటి వరకు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి దూరమయ్యారు. వీరిలో లోక్సభ సభ్యులు నలుగురు ఉండగా.. తాజాగా ఒక రాజ్యసభ సభ్యుడు కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ ఐదుగురు మాత్రమే కాదు.. ఎన్నికలకు ముందుగానే మరో 4 గురు ఎంపీలు కూడా పార్టీకి దూరం కావడం గ్యారెంటీ అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒక్కసారి వైసీపీకి దూరమైన ఎంపీల లిస్ట్ చూస్తే ముందుగానే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీకి దూరమయ్యారు.
ఆ తర్వాత జగన్కు అత్యంత సన్నిహితుడు అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన్ను ఈ సారి మచిలీపట్నం నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడంతో పాటు ఫైనాన్షియల్ కండీషన్లు పెట్టడంతో ఆయన జనసేన గూటికి చేరిపోయారు. ఇక బీసీ వర్గానికే చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ కూడా పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నారు. నరసరావుపేట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ నుంచి ఇదే స్తానంలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కూడా టీడీపీలో చేరి నెల్లూరు నుంచి పార్లమెంటకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎంపీలు పార్టీకి దూరమవ్వగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరో నలుగురు ఎంపీలు కూడా పార్టీకి దూరమవుతారని వైసీపీ వాళ్లే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు, నెల్లూరు ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఊగిసలాటలో ఉన్నారు. వీరు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కండువాలు మార్చేస్తారంటున్నారు. మాగుంటకు సీటు లేదని చెప్పేశారు. ఆదాలకు నెల్లూరు రూరల్ సీటు ఇచ్చారు. అక్కడ ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఆయన కూడా టైం కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు సీటు లేదని చెప్పారు.
ఆయన కనీసం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి కూడా సీటు లేదని క్లారిటీ ఇచ్చేశారని… ఆమె కూడా ఏం చేయాలో తెలియక డైలమాలో ఉన్నారని అంటున్నారు. ఏదేమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వైసీపీలో మరిన్ని ఎంపీ వికెట్లు పడడం ఖాయంగా కనిపిస్తోంది.