(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మంచి అవకాశం దొరకింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రస్తుతం రాజకీయంగా ఆయోమయంలో పడిపోయారు. ఎన్నికల్లో తక్కువ స్థానాలే రావడం, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలో నిలవకపోవడం, ఉన్న ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడకపోవడం, మరో వైపు అవినీతి ఆరోపణలు, కుమారుడు లోకేష్ కూడా అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్తారనే వార్తలు వస్తుండటం ఇటువంటి అంశాలు అన్నీ చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ తరుణంలో వీటన్నింటి నుంచి ఎంతో కొంత బయటపడాలంటే చంద్రబాబు తనకు తానుగా కొన్ని చేపడితే బాగుంటుంది అని రాజకీయ పక్షాల నుండి వాదన వస్తోంది.
సీబీఐ విచారణ ఆయనే కోరితే ఎలా ఉండేది..?
రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది వైఎస్ఆర్ సిపి ప్రధాన ఆరోపణ. చంద్రబాబుకు బినామీలుగా అప్పటి కొంత మంది మంత్రులు, కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతిలో భూములు కొనుగోలు చేశారనీ, ఒక సామాజికవర్గం చుట్టూ అమరావతిలో భూములు కొనుగోళ్లు, లావా దేవీలు జరిగాయనేది వైఎస్ఆర్ సిపి ప్రధాన అరోపణ. అందుకే దీనిపై సీబీఐ విచారణ కూడా చేయాలంటూ జగన్ సర్కార్ నిర్ణయించుకున్నది. అయితే ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాలన మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరితే చంద్రబాబుకు సానుకూల పవనాలు వీచే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం ఎలాగూ అన్నీ తవ్వుతోంది. ఒక్కోటి బయటపెడుతోంది. ఇవన్నీ దశలవారీగా కాకుండా చంద్రబాబు తనకు తానే స్వయంగా 2014 జూన్ 2వ తేదీ నుండి 2019 మార్చి 1వ తేదీ మధ్యలో విడుదల చేసిన జీవోలు, విడుదల చేసిన నిధులు, సంక్షేమ పథకాలు, పరిపాలన, టెండర్లు వీటన్నింటిపై కూడా సీబీఐ విచారణ చేయాలంటూ ఆయనే కోర్టులో పిటిషన్ వేసుకుంటే దేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్న నాయకుడిగా మిగిలిపోతారు. దీన్ని టీడీపీ శ్రేణులు కూడా హర్షిస్తాయి.
అవినీతి చేయలేదు అంటున్నారుగా..! దీనికెందుకు వెనుకడుగు..?
గడచిన ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చంద్రబాబు, లోకేష్ పదేపదే చెబుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అవినీతి జరిగిందనీ, లక్షల కోట్లలో చేతులు మారాయనీ, నీటి ప్రాజెక్టుల టెండర్లు, అమరావతి, ఫైబర్ గ్రిడ్ ఇలా అనేక అంశాలలో అవినీతి జరిగిందంటూ వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తోంది. అందుకే గడచిన ప్రభుత్వంలో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండరును కూడా సీబీఐ విచారణ చేయించి, అమరావతిలో జరిగిన ప్రతి లావాదేవీని సీబీఐ విచారణ చేయించాలని చంద్రబాబే స్వయంగా కోరి కోర్టులో పిటిషన్ వేసుకుని విచారణ జరిగేలా ఆయనే వ్యవహరిస్తే బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్న మాట. నిజంగా అవినితి చేయనప్పుడు, నిజంగా ఒక్క రూపాయి కూడా తీసుకోనప్పుడు చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తోంది. మరి దీనికి బాబు, లోకేష్లు ఎలా స్పందిస్తారో చూద్దాం.