జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినప్పుడు.. ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేదు. టీడీపీ ఒక్కటంటే ఒక్కసీటు గెలిచేందుకు ఎన్నో ఆపసోపాలు పడేది. అలాంటి చోట ఇప్పుడు ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయి. వైసీపీ మొత్తం ఖాళీ అయ్యేలా ఉంది. ఆ పార్టీ నుంచి మహామహులు, సీనియర్ నేతలే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. అదే నెల్లూరు జిల్లా. జగన్ పార్టీ పెట్టాక ఫస్ట్ ఫస్ట్ కోవూరు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోమిరెడ్డిపై ఘనవిజయం సాధించారు.
ఆ తర్వాత 2012లో జరిగిన 18 సీట్ల ఉప ఎన్నికల టైంలో కూడా నెల్లూరు పార్లమెంటు సీటును ఏకంగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ, ఆ తర్వాత 2014లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జడ్పీ పీఠంతో పాటు నెల్లూరు మేయర్ పీఠం గెలుచుకుంది. పార్టీ అధికారంలోకి రాకపోయినా 10 అసెంబ్లీ సీట్లకు 7 సీట్లతో పాటు నెల్లూరు ఎంపీ సీటు సైతం గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో మొత్తం 10కు 10 అసెంబ్లీ సీట్లతో పాటు నెల్లూరు పార్లమెంటు సీటు గెలుచుకుని స్వీప్ చేసేసింది. దీనిని బట్టే వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా అంటే జగన్, వైసీపీకి ఎంత కంచుకోటో తెలుస్తోంది.
అలాంటి జిల్లాలో ఇప్పుడు వైసీపీ కంచుకోటలు బద్దలవుతున్నాయి. పలు చోట్ల బీటలు వారుతున్నాయి. మహామహులుగా పార్టీలో ఉన్న వారే బయటకు వచ్చేస్తున్నారు. అసలు వైసీపీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వస్తారో కూడా అర్తం కావడం లేదు. ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఇక తాజాగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడారు.
నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ను ఎక్కడో గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంటకు బదిలీ చేసేశారు. ఇక ఇదే నెల్లూరు జిల్లాలోకి వచ్చిన కందుకూరులో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సైతం పార్టీని వీడతారని తెలుస్తోంది. పదేళ్ల నుంచి .. ఇంకా చెప్పాలంటే జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు ఆ కోట పూర్తిగా కూలిపోయేలా ఉంది. ఇక ఇదే లిస్టులో జిల్లా నుంచి మరి కొందరు నేతలు కూడా బయటకు వచ్చేస్తారంటున్నారు.