అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నకిలీ పత్రాలు సృష్టించి బస్సులతో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నారని ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడం అందరికీ తెలిసిందే. ఆ వివాదం ఇంకా నడుస్తూ ఉండగానే మరొక పక్క జెసి దివాకర్ రెడ్డి సోదరులు అనంతపురం జిల్లాలో తన భవనాన్ని ఆక్రమించుకున్నారని బాధితుడు మల్లికార్జున తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున అనంతపురంలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. 2009వ సంవత్సరంలో బాబాయి అనే వ్యక్తికి తన భవనాన్ని లీజుకు ఇవ్వగా అదే భవనంలో దివాకర్ రెడ్డి జేసీ ట్రావెల్స్ కార్యలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 2009 నుంచి భవనంకు సంబంధించిన అద్దె చెల్లించలేదని మల్లిఖార్జున ఆరోపించారు.
అన్యాయంగా తమ భవనాన్ని ఆక్రమించడమే కాకుండా తమ జోలికి వస్తే చంపుతానంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారంటూ మల్లిఖార్జున వాపోయారు. ఈ సందర్భంగా తన భవనాన్ని మళ్లీ ప్రభుత్వం తనకు ఇప్పించాలని, తన భవనం నుంచి జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున తన కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు.