అమరావతి, ఫిబ్రవరి 13: అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పదివేల ఆర్థిక సాయం అందించాలని మంత్రవర్గ సమావేశం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరువేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేలు రూపాయలు ఇవ్వాలని తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వ పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా పది వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వెల్లడించారు.
రైతుల బ్యాంకు ఖాతాల్లో ఫిబ్రవరి నెలాఖరు నాటికి కేంద్రం వేసే రెండు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలు జమ చేయనున్నట్లు మంత్రి సోమిరెడ్డి తెలిపారు.
ఖరీఫ్, రబీలో ఒక్కో సీజన్కు రైతులకు ఐదు వేల సాయం అందించడం జరుగుతుందని సోమిరెడ్డి చెప్పారు.
ప్రతి కౌలు రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
డ్వాక్రా మహిళలకు సిమ్ కార్డుతో సహా స్మార్ట్ ఫోన్లు పంపిణీ, పంచాయతీ కంటిజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపు, ఎన్జిఒలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సోమిరెడ్డి వెల్లడించారు.