Botsa Satyanarayana: ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది.16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమావేశమై వారి డిమాండ్ లపై చర్చించారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స మీడియాతో మాట్లడుతూ.. మార్చి లోపు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని తెలిపారు.
మధ్యంతర భృతి ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని, పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పామన్నారు బొత్స. గతంలో కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించలేకపోయామని, అందుకే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామన్నామని తెలిపారు. తాము పీఆర్సీనే ఇస్తామంటున్నప్పుడు ఇక ఐఆర్ ఎందుకు అని బొత్స ప్రశ్నించారు. పీఆర్సీ ఆలస్యమైతే .. ఐఆర్ కోసం ఆలోచిస్తామని చెప్పామన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్దీకరణకు ప్రభుత్వం యోచన చేస్తొందని అయితే కోర్టు కేసుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ నెల 27న ఉద్యోగులు చేపట్టనున్న ఛలో విజయవాడను విరమించుకోవాలని కోరామని, సానుకూల నిర్ణయం ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. నాలుగైదు అంశాలపై ఉద్యోగులు పట్టుబడుతున్నారని అన్నారు. వాటిపై కూడా త్వరలో నిర్ణయాలు ప్రకటిస్తామని తెలిపారు.