డిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ను ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేసినట్లు బిజెపి విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ నేత కిలారు దిలీప్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై వైకాపా నేతల దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడులకు పాల్పడుతున్న వారిపై సరైన చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రినీ కలిసి రాష్ట్రంలో తెలుగు మాధ్యమం ఎత్తివేసి ఇంగ్లీష్ ప్రవేశపెడుతున్న అంశంపై లేఖ ఇచ్చినట్లు తెలిపారు. 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నారని చెప్పామన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం వైసిపి ప్రభుత్వానికి తగదని అన్నారు. మాతృభాష లో విద్యను అభ్యసిస్తూ కూడా ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయని దిలీప్ అన్నారు. తొలుత మాతృభాష ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని కేంద్రమంత్రి రమేష్ పొక్రియాల్ తెలిపారని దిలీప్ చెప్పారు.