ఉత్తరప్రదేశ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా కొట్టిన సంఘటనలో దాదాపు 20 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 30 నుండి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బరువు ఎక్కువ కావడంతో పడవ బోల్తా కొట్టిందని భావిస్తున్నారు. బాందా దగ్గర ఈ దుర్ఘటన చేసుకుంది. ఫతేపూర్ నుండి యమునా నదిలో మార్కా గ్రామం కు పడవ పై వెళుతుండగా బోల్తా కొట్టింది. వీరంతా రాఖీ పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన మార్క పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా పోలీసులు, రెస్క్యూటివ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని ఎస్పీ అభినందన్ తెలిపారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. 15 మందిని రెస్క్యూటివ్ కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఇంకా గల్లంతయిన 17 మంది ఆచూకీ కోసం వెతుకులాట కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణం స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.