Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో ఊరట లభించలేదు. కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు.
కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 4న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్నందున .. ముఖ్యంగా తన చిన్న కుమారుడు 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మధ్యంతర బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది.
అయితే కవిత చిన్న కుమారుడు ఒంటరిగా ఏమీ లేడని, 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారనీ, ఆమె కుమారుడిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఉన్నారనీ, పరీక్షలు ఉన్నాయని మద్యంతర బెయిల్ అడుగుతున్నారని, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని, కవిత కుమారుడికి ఎగ్జామ్స్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును ఈడీ కోరింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కవిత కు మధ్యంతర బెయిల్ ను నిరాకరించింది.
ఇదిలా ఉండగా, కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇవేళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో .. రేపు (మంగళవారం) మళ్లీ తీహార్ జైల్ నుండి కోర్టు ముందు హజరుపరుస్తారు. మరో వైపు .. కవిత సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది.
Pawan Kalyan: సీఎం జగన్ పై పవన్ ఘాటు వ్యాఖ్యలు ..మంత్రి అమర్నాధ్ పై సెటైర్లు