Pawan Kalyan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే మంత్రి గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ఒక సీఎం కాదు.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీ దారు అంటూ ధ్వజమెత్తారు. గతంలో అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొకు వచ్చేది అనీ కానీ ఇప్పుడు అనకాపల్లి అంటే గుడ్డు పేరు వింటున్నామని అన్నాడు.
కోడి గుడ్డు పెట్టింది.. ఇంకా పొదుగుతూనే ఉందని వైసీపీ నేతలు కోడి కబుర్లు చెబుతున్నారని మంత్రి అమర్నాధ్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. వైసీపీ కోడి .. ఈ జిల్లాకు ఒక డిప్యూటి సీఎంను, అయిదు పోర్టు ఫోలియోలకు మంత్రిని, ఒక విప్ ను ఇచ్చింది కానీ ఒక్క కిలో మీటరు రోడ్డు కూడా వేయలేకపోయింది అంటూ పవన్ విమర్శించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి కోడిగుడ్డు మంత్రి అని పవన్ మాట్లాడినప్పుడల్లా యువకులు కేరింతలు కొట్టారు. పవన్ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని.. కూటమిని గెలిపించాలని పవన్కళ్యాణ్ కోరారు.
ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకూడదనడానికి కారణం యువత మహిళలు, పిల్లలేనని అన్నారు. మీ భవిష్యత్ కోసమే దశాబ్దం కాలం పాటు జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే లేకపోయినా పార్టీని నడిపానని అన్నారు. మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది కానీ నాకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. రాష్ట్ర భవిష్యత్త్ ముఖ్యమని అన్నారు. ప్రజలు బాగుండాలనే ఆకాంక్షతోనే పని చేస్తున్నానన్నారు. అమ్మఒడి పథకంలో కోతలు విధించారని మండిపడ్డారు. ఆఖరి ఏడాదిలో అమ్మఒడిని ఇవ్వకుండా తల్లులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యపాన నిషేధం చేస్తామని చెప్పి నాన్న గొంతులు తడుపుతున్న సారా వ్యాపారి జగన్ అని విమర్శించారు.
ఇసుక, ల్యాండ్లు దోచే స్కాంలను జగన్ మొదలెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదని అన్నారు. అన్ని శక్తులు కలవాలనే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్నానని వివరించారు. అనకాపల్లి స్థానం జనసేనది అయినప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థన మేరకు ఇచ్చానని చెప్పారు. ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్న సీఎం రమేష్ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. జనసేన నుంచి కొణతాల రామకృష్ణ, నాదెండ్ల లాంటి బలమైన నేతలు అసెంబ్లీలో ఉండాలని వారిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఉద్యగులకు న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.
YSRCP: చంద్రబాబుకు ఓటు వేయటమంటే పులి నోట్లో తల పెట్టినట్లే – వైఎస్ జగన్