ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మే 13న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ తో పాటు అటు పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన అటు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు కూడా నాలుగో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటు అధికార వైసిపి తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం – జనసేన – బిజెపి కూటమి కూడా అస్త్ర శాస్త్రాలు వాడుతూ ఎన్నికలలో విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నాయి. జగన్ ఒక్క అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని మినహాయిస్తే మిగిలిన 174 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు.
ఇటు కూటమి విషయానికి వస్తే చంద్రబాబు రెండు జాబితాలో పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. టిడిపి ఇంకా తాను పోటీ చేసే 17 పార్లమెంటు స్థానాలతో పాటు మరో పదహారు అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టిడిపి ప్రకటించే జాబితాలో పలువురు సీనియర్లు కూడా ఉన్నారు. వారికి టిక్కెట్ వస్తుందా ? రాదా అన్న సందేహం ఉంది. ఇప్పటికి రిలీజ్ చేసిన రెండు జాబితాలలో చంద్రబాబు పలువురు మహిళలు కూడా అవకాశం కల్పించారు. ఈసారి మహిళల్లో కొత్త వారికి కూడా అవకాశం దక్కింది.
గుంటూరు వెస్ట్ నుంచి బీసీ వర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవి తొలిసారి పోటీ చేస్తున్నారు. పాయకరావుపేటలో సీనియర్ పొంగలపూడి అనిత – రాప్తాడు లో మాజీ మంత్రి పరిటాల సునీత తో పాటు కురుపాం, కోవూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట లాంటి నియోజకవర్గాల్లో కొత్త మహిళ అభ్యర్థులు తెరమీదకు వచ్చారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఒక లేడీ డాక్టర్ను తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఆమె ఎవరో కాదు ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ రేసులో ఉన్న డాక్టర్ కడియాల లక్ష్మి. ఆమె మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్యకు స్వయానా కుమార్తె. లక్ష్మి సోదరుడు గొట్టిపాటి భరత్ 2014 ఎన్నికల్లో పరుచూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. లక్ష్మి ఎవరో కాదు ప్రస్తుత అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు అన్న కుమార్తె కూడా అవుతుంది. వీరి కుటుంబం నరసారావుపేట నియోజకవర్గ టీడీపీ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటోంది.
వాస్తవానికి ఈ కుటుంబం నరసారావుపేట టీడీపీ టిక్కెట్ ఆశించినా అక్కడ సమీకరణలు కుదర్లేదు. ఇక ఇప్పుడు దర్శి సీటు రేసులోకి దూసుకు వచ్చింది. లక్ష్మిని ఇక్కడ పోటీకి పెడితే ప్రకాశం జిల్లా ఆడపడుచు కావడం.. అటు బలమైన గొట్టిపాటి కుటుంబం నేపథ్యం ఉండడంతో ఇక్కడ చాలా సులువుగానే గెలుస్తుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. చంద్రబాబు కూడా దర్శిలో లక్ష్మి అభ్యర్థిత్వం విషయంలో సానుకూలంగానే ఉన్నారని టాక్ ?