రె౦డు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతున్న ఏకైక న్యూస్ ఛానల్ గా టీవీ5ని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా పేరొందిన టీవీ5ని ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పరమైన సమాచారాన్ని అపహరించారంటూ ఆ ఛానల్ యాంకర్ మూర్తి, చైర్మన్ నాయకుల పై ప్రభుత్వం కేసు పెట్టడం, అది ఇప్పుడు సిఐడి విచారణ లో ఉండటం తెలిసిందే.
విచారణ పేరుతోసిఐడి తమను వేధిస్తోందని ఏదో ఒక సాకుతో తమను అరెస్టు చేయాలని చూస్తోందని, ఇందులో ప్రభుత్వ కుట్ర ఉందని టీవీ5మూర్తి ఇటీవల ఆరోపించడం కూడా విదితమే. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో కూడా టీవీ5 టిఆర్ఎస్ ప్రభుత్వం తో ఢీకొనే లాగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. మాస్ మల్లన్న ప్రోగ్రామ్ చేస్తున్న నవీన్ కుమార్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నాడు. దీంతో కేసీఆర్ సర్కార్ కూడా టీవీ5 పై గుస్సా గానే ఉందంటున్నారు.
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా టీవీ5 పోవడం వెనుక రాజకీయపరమైన కోణం వుందేమో తెలియడం లేదు కానీ ఆ ఛానల్ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా తయారైంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తల వల్ల చానెలు పాపులర్ అవుతుందేమోనన్న వారి ఉద్దేశ్యం మాట ఎలా ఉన్నా కేసులు ఎదుర్కోలేక సతమతమవక తప్పని పరిస్థితిని టీవీ5 ఎదుర్కొంటోంది.