YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇవేళ ఇడుపులపాయ నుండి ప్రత్యేక బస్సు ద్వారా ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. తొలుత ఇడుపులపాయ లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అయితే వైఎస్ జగన్ వెంట జగన్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో పాటు తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు.
మేమంతా సిద్దం అనే పేరుతో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకూ ఆయన 21 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. రెండో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో జగన్ ఈ రోజు యాత్ర ప్రారంభించారు. అయితే ఇడుపులపాయకు తల్లి విజయమ్మ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇప్పటికే కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటు వైసీపీ అధినేతగా కుమారుడు జగన్ ఉన్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉండటంతో వైఎస్ విజయమ్మ ఎవరికి మద్దతుగా నిలుస్తారన్న సందేహం ఇటు పార్టీ శ్రేణుల్లో, మరో వైపు ప్రజల్లో నెలకొని ఉంది. అయితే ఇవేళ ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ హజరై కుమారుడు జగన్ కు ఆశీస్సులు అందజేయడంతో ఆమె మద్దతు జగన్ కే ఉందని చెప్పినట్లు అయ్యిందని వైసీపీ నేతలు అంటున్నారు.
కాగా, బస్సు యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుండి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుండి ఎన్నికల సమరశంఖం పూరించారు. వైఎస్ఆర్ ఘాట్ నుండి జగన్ బస్సు ముందుకు కదిలింది. కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగుతోంది. వేంపల్లి, వీఎన్ పల్లి, యర్రగుంట్ల ప్రొద్దటూరు జంక్షన్, పొట్లదుట్టి మీదుగా సాగి సాయంత్రం ప్రొదుటూరులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ బస్సు యాత్రలో పాల్గొన్నారు.
ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు