YS Jagan: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తన సర్కారు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు.ఉద్యోగులు కినుక వహిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న విషయం జగన్ కు తెలియంది కాదు.ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా,పవర్లో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి పోవాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు కారకులవుతారు.
అందువల్లే పరిస్థితి పూర్తిగా చేజారకముందే ఆయన దీనికో రెమిడీని ఆలోచిస్తున్నారని సమాచారం.ఇందులో భాగంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య సంధానకర్తగా పోస్టు ఒకదాన్ని క్రియేట్ చేసి అందులో అనుభవమున్న ఉద్యోగ సంఘాల నేతను నియమించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఏపీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు వెన్నపూస చంద్రశేఖర్ రెడ్డి పేరుఈ పోస్టుకు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలియవచ్చింది.
పదో తారీఖుకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ చేసిన పాదయాత్రలో ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. వాటిని నిలబెట్టుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా నానాటికీ దారుణంగా తయారవడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పించన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఎదురవుతోంది. అలాగే సీపీఎస్ రద్దు హామీని జగన్ నిలబెట్టుకోకపోవడం, డీఏలచెల్లింపులు కూడా వాయిదాల వారీగా సాగుతుండటం,పీఆర్సీ కొత్త నివేదికను పెండింగ్ లో ఉంచడం వంటి కారణాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి నానాటికీ పెరిగిపోతోంది.ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వల్ల డీఎలు ఇవ్వకపోవడం పీఆర్సీ నివేదికను ఆమోదించకపోవడం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు ఆ వాదనను అంగీకరించడం లేదు.సంక్షేమ పథకాల అమలుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎందుకని ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని వారు నిలదీస్తున్నారు.
YS Jagan: ముఖ్యమంత్రి దూరాలోచన!
ప్రభుత్వ ఉద్యోగుల లో బుసకొడుతున్న అసంతృప్తి ని ముఖ్యమంత్రి జగన్ తేలిగ్గా తీసుకోవడం లేదు.ఇప్పటికైనా ఇది తనకు ఇబ్బందికరమేనని ఆయన నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.అందుకనే ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఒక సంధానకర్తను నియమించి ఆయన ద్వారా ఉద్యోగ సంఘాలను బుజ్జగించే ఏర్పాట్లలో ముఖ్యమంత్రి ఉన్నారు.ఈ దశలో ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేయగలిగిన సమర్థత ఉన్న నాయకులుగా వెన్నపూస చంద్రశేఖర్రెడ్డి ఆయన కంట్లో పడ్డారు.ఈరోజో రేపో ఆయనకు ఈ పోస్టును ఇవ్వబోతున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.